మోడీ కేబినెట్లో చోటు కోసమే..: టిఆర్ఎస్పై పొన్నం
హైదరాబాద్: నరేంద్ర మోడీ కేబినెట్లో చేరేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆరాటపడుతోందని కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర కేబినెట్లో టిఆర్ఎస్ చేరాలనుకుంటోంది కాబట్టే బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓవైపు ప్రత్యేక హైకోర్టు కావాలంటూ న్యాయవాదులు ఉద్యమిస్తున్నా, కెసిఆర్ పట్టించుకోవడం లేదని పొన్నం మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి హైకోర్టు ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు.
తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులను ఓడిస్తామని న్యాయవాదులు హెచ్చరించాలన్నారు. అప్పుడే రెండు పార్టీలు దిగొస్తాయని పొన్నం ప్రభాకర్ చెప్పారు.

న్యాయవాదులు బుధవారం చేపట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమంతో పాటు, టిఆర్ఎస్, బిజెపి కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని పొన్నం సూచించారు. తెలంగాణ పిసిసి చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకంపై హైకమాండ్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
హైకోర్టును విభజించండి: ఎంపి జితేందర్రెడ్డి
న్యూఢిల్లీ: హైకోర్టును విభజించాలని కోరుతూ లోక్సభలో టిఆర్ఎస్ ఎంపి జితేందర్రెడ్డి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైకోర్టును విభజించాలని రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా ఉందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడి 9 నెలలైనా హైకోర్టు విభజన జరగలేదని అన్నారు.
హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల పలు కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కోర్టు రిక్రూట్మెంట్లోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు విభజన జరగాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications