ఎంపీ కవితపై పొన్నం సంచలన వ్యాఖ్యలు: వ్యక్తిగత విషయాన్ని రచ్చకీడ్చి..
హిందూ సాంప్రదాయంలో భార్యలు భర్తల ఇంటి పేరే పెట్టుకుంటారని, కవిత మాత్రం పుట్టింటి పేరునే ఇప్పటికీ చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు.
కరీంనగర్: నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేవిగా మారాయి. హిందూ సాంప్రదాయంలో భార్యలు భర్తల ఇంటి పేరే పెట్టుకుంటారని, కవిత మాత్రం పుట్టింటి పేరునే ఇప్పటికీ చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ఇటీవలి పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ ను ప్రారంభించిన నేపథ్యంలో.. ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రైల్వే లైన్ పూర్తి చేయడంలో ఎంపీ కవిత పాత్ర ఏమి లేదనట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో కవిత దీనిపై ఎప్పుడూ మాట్లాడలేదని ఆరోపించారు. ఒకవేళ పార్లమెంటులో కవిత రైల్వే ప్రాజెక్టు గురించి మాట్లాడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ కూడా చేశారు.
1993లో రాజకీయాల్లోకి వస్తానని కవిత కూడా ఊహించని సమయంలోనే దివంగత ప్రధాని పీవీ నరసింహరావు ఈ రైల్వే లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని పొన్నం చెప్పుకొచ్చారు. తాను, మధుయాష్కీ ఎంపీలుగా ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతి లభించినట్లు ఆయన వ్యాఖ్యానించారు.