ట్విస్ట్: 'సమ్మెను సృష్టించింది, పరిష్కరించింది కేసీఆరే'
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు గురువారం ఉదయం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్కు పిచ్చిపట్టిందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, వరంగల్ మాజీ ఎంపీ రాజయ్యలు ఆరోపించారు.
మామాఅల్లుళ్లు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఆర్టీసీ సమ్మెను సృష్టించింది, పరిష్కరించింది వారేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సబ్ కమిటీ నివేదిక ఇవ్వకముందే 44 శాతం ఫిట్మెంట్ ప్రకటన చేయడం కేసీఆర్ డ్రామా అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవటం లేదన్నారు.
జళగం వెంగళ రావు పార్కును ఆధునీకరిస్తాం: హరీష్ రావు
బంజారాహిల్స్లోని జళగం వెంగళ రావు పార్కును పూర్తిగా ఆధునీకరిస్తామని తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం ఉదయం మంత్రులు నాయిని, హరీష్ రావు జళగం వెంగళ రావు పార్కును సందర్శించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. పార్కులోని చెరువులో పూడికతీత పనులు ప్రారంభిస్తామన్నారు. జిమ్ సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్లో ముప్పై చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. చెరువులు కబ్జాకు గురికాకుండా ప్రత్యేక చట్టం తెస్తామన్నారు.