సినీతారల ఫొటోల మార్ఫింగ్, అశ్లీల సైట్లు: ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: పలువురు సినీ హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి వెబ్సైట్లలో అశ్లీలంగా చూపిస్తున్న ఇద్దరు వ్యక్తులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాలుగు ల్యాప్ టాప్లు, రెండు ఫోన్లు, మూడు సిమ్కార్డులతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్కు చెందిన ఠాకూర్ మహేశ్కుమార్, జయంత్జీ కలిసి ఐదు వెబ్సైట్లు రూపొందించుకున్నారు. హిందీ, తెలుగు, తమిళ చిత్రాలకు చెందిన ప్రముఖ హీరోయిన్ల ఫోటోలను ఇంటర్నెట్ ద్వారా తీసుకుని, వాటిని మార్ఫింగ్ చేసి అశ్లీలంగా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు.
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు.. ప్రముఖ హీరోయిన్ల గురించి తెలుసుకొని వారిపై లేనిపోని కథనాలు రాస్తూ అశ్లీలంగా చూపిస్తున్నట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. ఈ వెబ్సైట్ నిర్వహణ వల్ల వీరికి నెలకు రూ.30వేల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు.