తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు..??
తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. అది ప్రకృతి ధర్మం. అలాగే ఎవరి దగ్గరన్నా మనం పనిచేసేటప్పుడు కొంతకాలం తర్వాత ఆ పనిని మనమే సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇదీ సహజమే. అలాగే రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి అందరినీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను చేస్తున్న వ్యక్తికి తాను కూడా ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో అవ్వాలనిపిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
విజయవంతమైనవే ఎక్కువ
ఐప్యాక్ అనే సంస్థ ద్వారా ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీలకు సలహాదారులుగా పనిచేస్తూ వ్యూహాలను అందిస్తూ ఆయా పార్టీలను అధికారంలోకి తీసుకువస్తుంటారు. 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి పీకే ప్రధాన కారణం. ఆయన వ్యూహాలు అలా పనిచేశాయి. అలాగే 2019 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డికి పనిచేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఆ తర్వాత డీఎంకేకు పనిచేసి స్టాలిన్ ముఖ్యమంత్రి అవడంలో తోడ్పడ్డారు.
టీఆర్ఎస్తో ఒప్పందం
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు సలహాలనందించారు. భారతీయ జనతాపార్టీతో హోరాహోరీగా తలపడి మమతాబెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవన్నీ ఇలా జరుగుతున్న క్రమంలోనే ఆయన రాబోయే ఎన్నికల్లో బీజేపీని నిలవరించడానికి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీలో చేరే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విజయవంతమవలేదు.
పదవులపై వ్యామోహం?
తాజాగా జనసురాజ్ పేరుతో అక్టోబరు రెండోతేదీ నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. బీహార్ను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. పలువురు సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సామాజిక వేత్తల అభిప్రాయం ప్రకారం ప్రశాంత్ కిషోర్ కి కూడా రాజకీయంగా పదవులు అనుభవించాలనే వ్యామోహం కలగడంవల్లే ఆయన పార్టీలో చేరడంకానీ, సొంత పార్టీ స్థాపన కానీ చేయబోయారని విశ్లేషిస్తున్నారు.
వ్యూహాలు సమాజాభివృద్ధికి ఉపయోగించాలి
రాజకీయ నేతలను, వారి అధికారాన్ని దగ్గరుండి చూసినప్పుడు ఎవరికైనా తాము కూడా ఈ తరహా అధికారాన్ని అనుభవించాలనే ఆలోచన కలగడం సహజమని, దాన్ని అధిగమనించి సమాజం కోసం పనిచేసినప్పుడే గొప్ప వ్యక్తులుగా నిలిచిపోతారని చెబుతున్నారు.
అలా కాకుండా కేవలం అధికారం అనుభవించడానికి రాజకీయ పార్టీకానీ, వేదికకానీ ఏర్పాటు చేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం అంటే సాధ్యం కాని పని అని, దీనివల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉండదంటున్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు తమ వ్యూహాలను, కుయుక్తులను సమాజాభివృద్ధికి ఉపయోగిస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.