కెసిఆర్ చండీయాగంకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ: చంద్రబాబు వస్తారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించి ఆయత చండీయాగంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొంటారు. రాష్ట్రపతి డిసెంబర్ 27వ తేదీన యాగానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 23వ తేదీ నుంచి మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవలిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చండీయాగం నిర్వహించనున్నారు. ఇప్పటికే యాగానికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ యాగానికి రావాలని కేసీఆర్ ఇటీవలి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరారు.

ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. శీతాకాల విడిది కోసం ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ వస్తారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ఈ నెల 31 వరకు ఉంటారు. దీంతో, 27న చండీయాగంలో ప్రణబ్ పాల్గొంటారని రాష్ట్రపతి భవన్ నుంచి కేసీఆర్కు సమాచారం వచ్చిందని తెలుస్తోంది.
తాను దేవుడిని నమ్ముతానని, తన సొంత ఖర్చుతో చండీయాగం నిర్వహిస్తానని కెసిఆర్ చెప్పారు. ఏపీ సీఎం, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును కూడా చండీయాగానికి ఆహ్వానిస్తానని కెసిఆర్ చెప్పిన విషయం తెలిసిందే. కెసిఆర్ ఆహ్వానాన్ని మన్నించి చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు.












Click it and Unblock the Notifications