ప్రధానమంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ వచ్చే తేదీ ఖరారు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈనెల 26వ తేదీన హైదరాబాద్ రానున్నారు. నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. అలాగే రామగుండలో ఏర్పాటు చేసిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఎరువుల కర్మాగారాన్ని కూడా ఆయన హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా నిర్వహించబోతున్నారు.
అధికారిక కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా నరేంద్రమోడీ పాల్గొనబోతున్నారు. తెలంగాణకు పార్టీ నేతలతో కీలక సమావేశం జరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి భారీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడానికి తెలంగాణ బీజేపీ శాఖ సన్నాహాలు చేసుకుంటోంది.
భారతీయ జనతాపార్టీ సీనియర్ నేతలంతా తెలంగాణ బాటలో పయనిస్తున్నారు. ఇప్పటికే జేపీ నడ్డా, అమిత్ షా బహిరంగసభల్లో పాల్గొని వెళ్లారు. ఇప్పుడు ప్రధానమంత్రి వంతు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. అందుకు తగ్గట్లుగా రాష్ట్రంలో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రధానమంత్రి కూడా హైదరాబాద్ వచ్చి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటుండటంతో శ్రేణుల్లో కొత్త జోష్ కనపడుతోంది.