తెలంగాణా..? ఆంధ్రా..? ఏపీ అయితేనే జాబ్ : ప్రైవేటు కంపెనీలపై కోదండరామ్
హైదరాబాద్ : 'నీళ్లు-నిధులు-నియామాకాలు' తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఈ మూడు పునాదుల మీద. నిధుల విషయాన్ని పక్కనబెడితే తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడినా..! నీళ్లకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో, నియామాకాలకు సంబంధించి అటు ప్రభుత్వ జాప్యాన్ని, ఇటు ప్రైవేటు సంస్థల వైఖరిని విమర్శిస్తున్నారు పలువు మేధావులు.
తాజాగా 'తెలంగాణలో విద్యాభివృద్ధికి ప్రభుత్వ బాధ్యత' అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరామ్ దీనిపై స్పందించారు. నియామాకాల విషయంలో ప్రైవేటు సంస్థలు అనుసరిస్తున్న పోకడలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో పెట్టుబడులకు ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చినా.. అవేవీ స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పైవేటు కంపెనీల నియామాకాలను తప్పుబడుతూ.. తెలంగాణలో కార్యకలాపాలు సాగిస్తోన్న ప్రైవేటు సంస్థలన్ని ఇంటర్వ్యూకు వచ్చిన వ్యక్తి ఆంధ్రానా..? తెలంగాణా..? అన్న అంశం తేల్చుకున్న తర్వాత, ఆంధ్రోళ్లు అయితేనే ఉద్యోగాలిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో చాలా కంపెనీలు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాయని, ప్రభుత్వం కూడా తెలంగాణ వ్యతిరేక శక్తులకే పెద్ద పీట వేస్తోందని ఆరోపించారు కోదండరామ్. ప్రైవేటు సంస్థల్లో నియామాకాలకు సంబంధించి స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చేందుకు అంగీకరించే కంపెనీలకే రాష్ట్రంలో అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యపై కూడా ప్రైవేటు శక్తులు కన్నేశాయని చెప్పుకొచ్చిన కోదండరామ్, పాలిటెక్నిక్ ను ప్రైవేటికరించే కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని తేల్చి చెప్పారు.