మంత్రి జోగు రామన్నకు తప్పిన ప్రమాదం: 16మందితో లిఫ్ట్ తెగిపడింది!
మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్నకు పెద్ద ప్రమాదం తప్పింది. మంచిర్యాలలో ఓ టీఆర్ఎస్ కౌన్సిలర్ తనయుడు ఏర్పాటు చేసిన ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన జోగు రామన్న, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు సహా 16మందితో మూడో అంతస్తుకు వెళ్తుండగా.. ఒక్కసారిగా మొదటి అంతస్తులోనే వైర్ తెగిపోవడంతో లిఫ్ట్ కిందపడిపోయింది.
ఊహించని రీతిలో జరిగిన ఈ సంఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ వెంటనే తేరుకొని గ్రౌండ్ ఫ్లోర్లో లిఫ్ట్లో ఉన్న మంత్రి రామన్న, ఎమ్మెల్యే దివాకర్ రావు సహా అందరినీ కుర్చీలు వేసీ బయటకు తీశారు.
నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్లో 10మంది మాత్రమే వెళ్లే వెసులుబాటు ఉండగా, 16మంది వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. అయితే, మంత్రి సహా మిగితా వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత మంత్రి రామన్న ఆస్పత్రిని ప్రారంభించారు.