ప్రయివేట్ ఆసుపత్రులా.?రక్త పింజరులా.?ఆ బిల్లులేంటి.?ఆ దోపిడీ ఏంటి.?నియంత్రించేది ఎవరు.?
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కోవిడ్ బాదితులు రెండు రకాల నరకాన్ని అనుభవిస్తున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ పాజిటీవ్ వార్త విని సగం చచ్చిపోతుంటే, ఆ తర్వాత ఆసుపత్రులు వేసే బిల్లులతో ఆస్తులు అమ్ముకోలేక, అప్పులు చేయలేక సగం ప్రాణం పోతున్నట్టు తెలుస్తోంది. నగరంలో ప్రయివేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నట్టు ఎన్నో ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి దెబ్బకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రిలో చేరితే వైద్యం కోసం ఆసుపత్రులు వేసే బిల్లులను చూసి ఉన్న కొన ఊపిరి గాల్లో కలిసిపోతున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.
ఊహించని ఉత్పాతం.. మానవాళిని చిదిమేస్తున్న కరోనా..
దేశంలో అత్యంత విపత్కర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సామాన్య మద్య తరగతి ప్రజలపైన దీని ప్రభావం తీవ్రంగా పడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని సంవత్పరాలుగా కాయ కష్టం చేసి ఎంతో కొంత సంపాదించుకున్న సొమ్ములను కరోనా మహమ్మారి కాజేస్తున్న వాస్తవాలు బహిర్గతం అవుతున్నాయి. సంపన్నుల సంగతి పక్కన పెడితే కరోనా వల్ల మద్య తరగతి, పేద ప్రజలు మాత్ర ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలకొట్టుకుంటున్న పరిస్దితులు కనిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిందనన్న వార్త మానసికంగా సగం చంపేస్తుంటే, ఆసుపత్రుల బిల్లులను చూసి పూర్తిగా ప్రాణాలు వదిలేస్తున్నారు సామాన్య ప్రజలు.
ప్రాణాలతో చెలగాటం.. డబ్బు ఉంటేనే జబ్బు నయం చేస్తామంటున్న ప్రయివేట్ ఆసుత్రులు..
కరోనా వైరస్ రెండవ దశ అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. ప్రధానంగా నలభై నుండి ఆ పైన ఉన్న వయస్సు వారందరిపైన అత్యంత దారుణంగా ప్రభావం చూపెడుతోంది. శరీరంలో రోగ నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉన్నవారు పిట్టల్లా రాలిపోతున్నారు. ఆసుపత్రుల్లో చేరితే ప్రాణాలు దక్కుతాయనుకున్న వారు అప్పో సొప్పో చేసి ఆసుపత్రులు వేసిన బిల్లులను చెల్లించి చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న చందంగా ఇళ్లకు చేరుకుంటున్న సందర్బాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రయివేటు ఆసుపత్రుల్లో నిబంధనలు చూసి కొంత మంది అవాక్కవుతున్న పరిస్దితులు నెలకొన్నాయి. పేషెంట్ ను బంధువులు చూడడానికి వీలు ఉండదు, కలవడానికి వీలుండదు.. కాని అడిగినంత బిల్లు మాత్రం కౌంటర్ లో కట్టాల్సిందే..!
లక్షల్లో బిల్లులు.. మనోవేదనతో ప్రాణాలు ఒదిలేస్తున్న రోగులు..
కరోనా వైరస్ తో ప్రయివేటు ఆసుపత్రిలో చేరిన రోగి ఓ పదిహేను రోజుల తర్వాత చనిపోతే శవాన్ని తీసుకెళ్లడానికి బంధువులకు ప్రాణాలు పోయినంతపని అవుతున్నట్టు తెలుస్తోంది. పదిలక్షల వరకూ ఆసుపత్రిలో కట్టిన తర్వాత మరో పదిలక్షలు కడితేనే శవాన్ని ఇస్తామని కనికరం లేకుండా తేల్చి చెప్పడం అత్యంత అమానవీయ కోణన్ని ఆవిష్కరిస్తోంది. ఇలాంటి హృదయ విరాదక ఘటనలన్నీ ప్రయివేటు ఆసుపత్రుల్లో చోటు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. మరి కరోనా క్లిష్ట సమయంతో ప్రయివేటు ఆసుపత్రులు ఇంతటి రాక్షస క్రీడకు పాల్పడుతుంటే నియంత్రించే వ్యవస్ధలు ఏంచేస్తున్నాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తనిఖీలు లేవు.. నియంత్రణ లేదు.. ఇష్టారాజ్యంగా ప్రయివేటు దందా..
జరగాల్సిన నష్టం ఓ పక్క జరిగిపోతుంటే ప్రభుత్వం చాలా కూల్ గా స్పందించినట్టు తెలుస్తోంది. ఎక్కడైనా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక బిల్లులు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వస్తే కఠిన చర్యలు చేపడతామని ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. డాక్టర్లు లేదా కింది స్థాయి సిబ్బంది ఎవరైనా ఈ విషయంలో తప్పు చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. ప్రయివేట్ ఆసుపత్రుల దోపిడి గురించి నిఘా పెడుతున్నట్టు మంత్రి చేసిన ప్రకటన చూసి బాదితులకు నవ్వాలో, ఏడవాలో తెలియని పరిస్దితులు నెలకొన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్దితిలో పేద ప్రజలకు ప్రభుత్వం ఆసరాగా ఉండాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చడం ఒక్కటే మార్గం అనే చర్చ జరుగుతోంది. దీంతో ఎంతో మంది కరోనా బాదితులకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చి వారి ప్రాణాలను కాపాడినట్టవుతుందే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.