తెలంగాణను రాజస్థాన్గా మారుస్తారా?: హైకోర్టు ఆగ్రహం, వరద సహాయక చర్యలపై ప్రభుత్వానికి స్పష్టత
హైదరాబాద్: చెరువుల ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువులను కాపాడకపోతే తెలంగాణ కూడా రాజస్థాన్లా మారుతుందని హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఖాజాగూడ చెరువులో నిర్మాణాలపై సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్ వేసిన పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.
చెరువులు ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారు?
చెరువులను కాపాడుకోవాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాలో చెరువుల ఆక్రమణలపై అనేక పిటిషన్లు వస్తున్నాయని, చెరువులు కబ్జా అవుతుంటే జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్టీఎల్ ఖరారుకు ప్రభుత్వ విధానాలను సమర్పించాలని ఆదేశించింది. పోలీసుల ప్రమేయం లేకుండా చెరువుల కబ్జా అడ్డుకోవడం కష్టమని, చెరువుల పరిరక్షణ కమిటీతో డీఎస్పీ ఉన్నారా? లేదా అనే విషయాన్ని తమకు తెలియజేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.
చర్యలు తీసుకోండి..
సెప్టెంబర్ 6 లోగా నివేదిక సమర్పించాలని, తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 7కి వాయిదా వేసింది. కాగా, కూకట్పల్లి కిందికుంట చెరువు ఆక్రమణల విషయమై విచారణ జరిపి ఆగస్టు 13న నివేదిక ఇవ్వాలని మేడ్చల్ కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. కిందికుంట చెరువు కబ్జాకు గురువుతోందని దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించింది. కిందికుంట చెరువును పరిశీలించి ఆక్రమణలుంటే చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వరదల సహాయక చర్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది..
ఇది ఇలా ఉండగా, తెలంగాణ వ్యాప్తంగా భారీ కురుస్తున్న వర్షాలు, దీంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కూడా హైకోర్టు స్పందించింది. సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టును కోరడంతోపాటు ఈ విషయంపై హైకోర్టు సుమోటోగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, న్యాయవాది అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టిందని హైకోర్టు తెలిపింది. హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలను ప్రభుత్వం చేసిందని, వరద ప్రాంతాలకు ప్రభుత్వం హెలికాప్టర్లు కూడా సిద్ధం చేసిందని పేర్కొంది. ప్రభుత్వం వరద పరిస్థితులపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని హైకోర్టు తెలిపింది.