పాలమూరు డిజైన్ మార్చాల్సిందే : కోదండరామ్, 21 నుంచి షురూ..!
మహబూబ్ నగర్ : తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ ప్రక్రియపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వివాదంతో తెలంగాణలొ ప్రాజెక్టుల అంశం గత కొద్దిరోజుల నుంచి చర్చల్లో ఉంటూ వస్తోంది. తాజాగా ప్రభుత్వ రీడిజైనింగ్ ల స్పందించిన టీజేఏసీ ఛైర్మన్, ప్రొఫెసర్ కోదండరామ్, పాలమూరు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం రూపొందించిన డిజైన్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు.
సమగ్ర పరిశీలన నిమిత్తమై గత కొద్దిరోజులుగా ప్రాజెక్టుల విషయంలో తలమునకలైన ప్రొఫెసర్ కోదండరామ్, సోమవారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. అనంతరం ప్రాజెక్టుల విషయమై మీడియాతో మాట్లాడిన ఆయన.. 'పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన డిజైన్ ను మార్చాల్సిందిగా' డిమాండ్ చేశారు.

ప్రాజెక్టులు వల్ల రైతులకు అన్యాయం తలపెట్టవద్దన్న కోదండరామ్, ముంపు ప్రాంతాల పరిశీలన నిమిత్తం ఈ నెల 21 నుంచి తన పర్యటన ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్వాసితుల గురించి ప్రస్తావిస్తూ.. నార్లపూర్ నుంచి ఉదంపూర్ వరకు ఎంతో మంది రైతులు నిర్వాసితులుగా మారే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ముంపు ప్రాంతాల్లో పర్యటన అనంతరం సమస్యలపై ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నట్టు తెలిపారు కోదండరామ్.












Click it and Unblock the Notifications