ప్రొ.నాగేశ్వర్ 'లాజిక్': ఆ పని ఎందుకు చేయరు?, ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అయితే ఐదేళ్లు ఆగుతరా?..
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్ష పాత్రను తన భుజాలపై వేసుకున్న ప్రొఫెసర్ కోదండరాం సామాజిక సమస్యలపై ప్రభుత్వాన్ని ఢీకొడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో వేలమంది నిరుద్యోగులతో కొలువుల కొట్లాట సభ నిర్వహించారు.
మేదావులు, రాజకీయ నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు ఈ సభకు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అయితే ఆర్నెళ్లలోనే ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం ఏళ్లకేండ్లు ఎందుకింత జాప్యం చేయాలని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అయితే:
'ఏ సంవత్సరంలో ఖాళీ అయిన ఉద్యోగాలను ఆ సంవత్సరంలో ఎందుకు భర్తీ చేయరు?, ఎమ్మెల్యే పోస్టు ఖాళీ అయితే ఐదేళ్లు ఆగుతరా?.. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ ఉన్నట్లే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంప్లాయిమెంట్ కమిషన్ ఎందుకు లేదు?' అని ప్రొఫెసర్ నాగేశ్వర్ నిలదీశారు.

ఎందుకు ఆగాలి?:
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఐదేళ్లు, పదేళ్లు ఎందుకు ఆగాలని నాగేశ్వర్ ప్రశ్నించారు. ఎంప్లాయిమెంట్ కమిషన్ ఏర్పాటు చేసి.. ఒక ఏడాదిలో ఖాళీ అయ్యే ఉద్యోగాలను ఆ కమిషన్ ద్వారా భర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అందరికీ ఉద్యోగాలు సాధ్యమేనా? అన్న ప్రశ్నపై కూడా నాగేశ్వర్ స్పందించారు. అందరికీ ఉద్యోగం ఇవ్వలేకపోవచ్చు కానీ చదువుకున్న ప్రతీ విద్యార్థికి కోచింగ్ ఇవ్వవచ్చునని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రూ.50కోట్లు ఖర్చు పెడితే తెలంగాణలో ప్రతీ బిడ్డకు కోచింగ్ ఇచ్చే అవకాశముంటుందన్నారు. ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ ఇస్తే.. నిరుద్యోగులు వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్లు తీసుకునే అవసరం ఉండదని, పెద్ద మేలు జరుగుతుందని అన్నారు.

అలా అయితే నడవనియ్యం:
'మణులడిగామా? మాణిక్యాలడిగామా? నీ కుర్చీ ఏమన్నా అడిగామా?.. ఆంక్షలకు ఆకాంక్షలు తలొంచవు, తెలంగాణ సాధించుకున్నట్టుగానే కొట్లాడి ఉద్యోగాలు సాధించుకుంటం' అని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు.
ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థల్లో 2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామంటున్న ప్రభుత్వం, వాటిలో తెలంగాణవారికి ఎన్ని వచ్చాయో వెల్లడిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భాగస్వామ్యం లేని రాజకీయాలు నడవనీయబోమని, కొత్త సమాజాన్ని స్థాపిస్తామని స్పష్టంచేశారు.

వెనుకడుగు వేయం
కొలువుల కొట్టాట సభను రాజకీయ నిరుద్యోగుల సభ అని ఓ మంత్రి అంటే నవ్వు వస్తోందన్నారు కోదండరాం. రాజకీయంలో నిరుద్యోగం ఉండదని, నిరుద్యోగులకు ఉద్యోగం కావాలని అడగడం సిగ్గుపడే పనేమీ కాదన్నారు. మేం తప్పుడు పని చేస్తలేమని, నిరుద్యోగులకు అవకాశాలు వచ్చేదాకా వెనుకడుగు వేయమని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications