కన్నీరు మున్నీరైన హైదరాబాద్ పాతబస్తీ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వెల్లడించారు. అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక చర్యలో ఆయన హతమైనట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఖమేనీని అత్యంత దుర్మార్గుడైన నాయకుడిగా అభివర్ణించారు ట్రంప్. ఈ విషయాన్ని అటు ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. 40 రోజుల సంతాప దినాలను పాటించాలని పిలుపునిచ్చింది.
ఖమేనీ మరణించడం పట్ల హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విషాదకర వాతావరణం నెలకొంది. ఖమేనీ మరణానంతరం నిరసనలు చోటుచేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ ప్రాంతంలో షియా ముస్లింలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఖమేనీ మరణాన్ని షియా కమ్యూనిటీ నాయకుడు సయ్యద్ సమర్ కాజ్మీ ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ మోసపూరితంగా ఇరాన్ నాయకుడిని హత్య చేశాయని ఆయన ఆరోపించారు.

ఓ బలమైన నాయకుడిని కోల్పోవడం ఇది మొదటిసారి కాదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇదే మాదిరి వాతావరణం హైదరాబాద్ లోనూ నెలకొంది. ప్రత్యేకించి పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పురుషులు, మహిళలు, చిన్నపిల్లలు పాల్గొన్నారు. ఖమేనీ చిత్రాలను ప్రదర్శిస్తూ నివాళి అర్పించారు. షాలిబండ, పురానీ హవేలీ, యాకుత్ పురా, డబీర్ పురా వంటి ప్రాంతాల్లో ఈ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. రోడ్డు పక్కన శ్రద్ధాంజలి సమావేశాలు సైతం నిర్వహించారు.
షియా సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. ఇరాన్ వనరులను కబ్జా చేయడానికే ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు. మానవళికి ముప్పు పొంచివుందనే సాకుతో ఈ దాడులు జరిగాయని విమర్శించారు. ఈ ర్యాలీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. దారి పొడవునా పోలీసులు మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.












Click it and Unblock the Notifications