Google డేటా సెంటర్ తో విశాఖకు నీరు, విద్యుత్ సంక్షోభం ? తేల్చేసిన ఎంపీ ..!
ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విద్యుత్, నీటి సంక్షోభాలు తప్పడం లేదు. ఇదే తరహాలో ప్రస్తుతం ఏపీలోని విశాఖ (Visakhapatnam)లో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ (Google Data Centre) వల్ల కూడా రేపు నగరానికి నీరు, విద్యుత్ సంక్షోభం తప్పదన్న ఆందోళనలు నెలకున్నాయి. ఇదే అంశంపై ఇవాళ స్థానిక ఎంపీ శ్రీభరత్ (Sribharat)స్పందించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వల్ల నగరంలో నీటి కొరత లేదా విద్యుత్ కొరత ఏర్పడుతుందన్న పర్యావరణవేత్తల ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు.
సుస్థిర అభివృద్ధిని కొనసాగిస్తూనే, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను, వనరులను బలోపేతం చేస్తోందని ఎంపీ భరత్ చెప్పుకొచ్చారు. గృహ అవసరాలు, పరిశ్రమలు, టౌన్షిప్లు, ఇతర అవసరాల కోసం నగరానికి రోజుకు సుమారు 480 మిలియన్ లీటర్ల (MLD) నీరు అవసరమని, ప్రస్తుతం సుమారు 410 MLD నీటి సరఫరా మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. 2040 నాటికి విశాఖపట్నం జనాభా రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నందున, నీటి లభ్యతను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ జాప్యం కారణంగా నీటి సామర్ధ్యం ఇంకా పూర్తిగా వినియోగంలోకి రాలేదన్నారు.

పోలవరం నీటిని ప్రస్తుత మౌలిక సదుపాయాలతో అనుసంధానించి, తదుపరి ఆధునీకరణ పనులు చేపట్టినట్లయితే, రాబోయే సంవత్సరాల్లో నగర నీటి సరఫరా సామర్థ్యం సుమారు 2,110 ఎంఎల్డీకి పెరిగే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. అలాగే విద్యుత్ వినియోగం విషయానికి వస్తే, ఈ డేటా సెంటర్కు దాదాపు ఒక గిగావాట్ విద్యుత్ అవసరం కావచ్చని ఎంపీ అంగీకరించారు. 2029-30 నాటికి 50 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించిందని, ప్రభుత్వ ఇంధన విధానానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా పునరుత్పాదక శక్తిపైనే ఆధారపడనుందని ఆయన పేర్కొన్నారు.
సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో డేటా సెంటర్ల వల్ల సవాళ్లు ఎదురైనట్లు భరత్ తెలిపారు.














Click it and Unblock the Notifications