ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. కానీ ఆ ప్రాంతాల్లో వానలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం విభిన్నంగా ఉంది. గత వారం రోజులు చిరుజల్లులతో, అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలతో చల్లబడి రాష్ట్రం ఇప్పుడు మళ్లీ వెడెక్కుతుంది. మరోవైపు రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. జూన్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం మీదుగా మరింత ముందుకు పయనించాయని, రాబోయే 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి వేగంగా విస్తరించడానికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
దీనికి తోడు, తూర్పు ఉత్తర ప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి (ఉపరితల ఆవర్తనం) కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రాగల మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు, రేపు (మంగళ, బుధవారాలు) ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

అక్కడక్కడా పిడుగులు పడే ముప్పు ఉన్నందున ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షంతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే వీలుంది. అయితే, పగటిపూట మాత్రం వేడి, అధిక తేమ కారణంగా తీవ్రమైన ఉక్కపోత, అసౌకర్య వాతావరణం పొంచి ఉంటుంది. ఎల్లుండి (గురువారం) నాటికి వర్షాల తీవ్రత కాస్త పెరిగి కొన్ని చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగనుంది. ఈరోజు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు పడవచ్చు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు జనజీవనానికి స్వల్ప ఆటంకం కలిగించవచ్చు. కోస్తా తీర ప్రాంతాల్లో వేడి, తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడక తప్పదు. గురువారం నాడు మాత్రం కొన్ని ప్రాంతాలలో వర్షాలు మరింత విస్తరిస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
రాయలసీమ ప్రాంతం
రాయలసీమ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు (ఈరోజు, రేపు, ఎల్లుండి) వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండవు. ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని అధికారులు హెచ్చరించారు. రాయలసీమలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు స్పష్టం చేశారు. రైతులతో పాటు సామాన్య ప్రజలు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.














Click it and Unblock the Notifications