సెలైన్ బాటిల్లో విషం.. ప్రియుడి పోస్ట్తో దొరికిపోయిన కిల్లర్ వైఫ్!
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దేశసేవలో 17 ఏళ్లు గడిపి రిటైర్ అయిన ఒక మాజీ జవాన్ను, అతని భార్య ఆమె ప్రియుడితో కలిసి ఆసుపత్రిలోనే అత్యంత కిరాతకంగా హతమార్చింది. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా చిత్రీకరించి, రూ. 2 కోట్ల బీమా సొమ్మును కాజేయాలనే దురాశతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. ఘోడాగేరి గ్రామానికి చెందిన రిటైర్డ్ సైనికుడు సందీప్ మంజరగి 2026 మార్చి 13న ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చికిత్స కోసం ఆయనను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, సందీప్ భార్య సుమకు పుండలిక్ డోంగ్రె అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. సందీప్ పేరిట ఉన్న రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుపై కన్నేసిన ఈ ఇద్దరూ, అతడిని పూర్తిగా వదిలించుకోవాలని పథకం వేశారు.
సెలైన్ బాటిల్లో ఘోరమైన విషం
రోడ్డు ప్రమాదం వీరికి అవకాశంగా మారింది. ఆసుపత్రిలో పనిచేసే రాహుల్ అనే బంధువు సాయంతో సుమ తన భర్తను ఓ స్పెషల్ వార్డుకు మార్పించింది. మార్చి 14న సందీప్కు ఎక్కిస్తున్న సెలైన్ బాటిల్లో నల్లుల మందు, ఎలుకల విషాన్ని కలిపారు. అయినా ఆయన చనిపోకపోవడంతో, మరుసటి రోజు సెలైన్ బాటిల్లో ఏకంగా పురుగుల మందు కలిపి ఎక్కించారు. దీంతో సందీప్ తీవ్ర నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోయారు. సందీప్ గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించి, మృతదేహాన్ని ఖననం చేశారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నిందితులు ఫోరెన్సిక్ వ్యవస్థను కూడా మేనేజ్ చేశారు. ఎఫ్డీఏ ఉద్యోగి అశోక్ గుజ్నాల్ ద్వారా ఎఫ్ఎస్ఎల్ అధికారుల స్థాయి వ్యక్తులకు రూ. 3 లక్షలకు పైగా లంచం ఇచ్చి, పోస్ట్మార్టం నివేదికను మార్చేశారు. విషప్రయోగం జరిగిన విషయాన్ని దాచిపెట్టి, సహజ మరణంగా చూపించారు.

పంపకాల గొడవతో బయటపడ్డ రహస్యం
పాపం పండక మానదు అన్నట్లు, లంచాలు ఇచ్చి కేసు క్లోజ్ చేయించినప్పటికీ.. అసలు సమస్య రూ. 2 కోట్ల బీమా డబ్బు పంపకాలతో మొదలైంది. ఇన్సూరెన్స్ సొమ్ము వాటా విషయంలో సుమ, పుండలిక్ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. వీరి మధ్య జరిగిన గొడవలు, సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద స్టేటస్లు పోలీసుల దృష్టిని ఆకర్షించాయి. అనుమానం వచ్చిన పోలీసులు ఇద్దరినీ విచారించడంతో అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు మెజిస్ట్రేట్ సమక్షంలో సందీప్ సమాధిని తవ్వి, మూడు నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహ అవశేషాలను వెలికితీశారు. బెంగుళూరులోని ప్రధాన ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో సందీప్కు విషం ఇచ్చినట్లు స్పష్టంగా తేలింది. ఈ దారుణ ఉదంతంలో భార్య సుమ, ప్రియుడు పుండలిక్, లంచం తీసుకున్న ఎఫ్ఎస్ఎల్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ నాగరాజ్ సహా పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications