కాంగ్రెస్కు హరీష్ ఛాలెంజ్: అది నిరూపించండి.. రాజీనామా చేస్తా!..
ప్రాజెక్టులకు టీఆర్ఎస్ అడ్డంపడుతున్నట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్దమని హరీష్ ప్రకటించారు.
జనగామ: సాగునీటి ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో యుద్దప్రాతిపదికన పూర్తి చేస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తుంటే.. తప్పుడు కేసులతో కాంగ్రెస్ వాటికి అడ్డం పడుతోందని ఆరోపించారు.
Recommended Video
జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నవాబుపేటలో శుక్రవారం రూ.298 కోట్లతో నిర్మించిన 0.47 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ప్రాజెక్టులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
నిరూపిస్తే రాజీనామా:
14ఏళ్ల టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ అడ్డుకోలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ గడిచిన మూడేళ్లలో ఎన్ని ప్రాజెక్టులకు అడ్డుపడిందో నిరూపిస్తామని చెప్పారు. ప్రాజెక్టులకు టీఆర్ఎస్ అడ్డంపడుతున్నట్టు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి తాను సిద్దమని హరీష్ ప్రకటించారు. దమ్ముంటే షబ్బీర్ అలీ ఈ సవాల్ స్వీకరించాలన్నారు.
ఆ ఘనత టీఆర్ఎస్దే
మల్కాపూర్, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా వరంగల్ ఉమ్మడి జిల్లాను మరో కోనసీమలా మారుస్తామన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని లాంటి మల్కాపూర్ రిజర్వాయర్కు త్వరలో టెండర్స్ పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో రైతులకు రూ.17వేల కోట్ల రుణాల మాఫీ, వెయ్యి కోట్లతో గోదాముల నిర్మాణం, మూడేళ్లలో దేవాదుల కోసం రూ.2 వేల కోట్లతో 5 వేల ఎకరాల భూసేకరణ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.
అడగకుండానే 24గం. విద్యుత్
ఓవైపు పొరుగు రాష్ట్రాల్లో రైతులపై కాల్పులు, రైతులను పీడించే ఘటనలు, రైతాంగం తిరుగుబాటు ఉద్యమాలు జరుగుతుంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులు అడగకముందే 24గం. విద్యుత్, సాగునీరు,వ్యవసాయ పెట్టుబడులు అందించారని అన్నారు.
45 వేల ఎకరాలకు సాగునీరు
జనగామ జిల్లాలోని నవాబుపేట రిజర్వాయర్ ద్వారా వచ్చే సీజన్ నాటికి 45 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఉప్పుగల్లు, పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. మంత్రి పదవిని కాదని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ఆదర్శనీయుడని కొనియాడారు.