జల్సాలకు మరిగి సూడో పోలీసు అవతారమెత్తిన రోబో
హైదరాబాద్: పోలీసు అవతారమెత్తి అమాయకులను బెదిరిస్తూ చోరీలు చేస్తున్న వ్యక్తిని హైదరాబాదులోని కాచిగూడా పోలీసులు పట్టుకున్నారు. జల్సాలకు అలవాటు పడి అతను ఈ తరహా చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. శుక్రవారం మీడియా సమావేశంలో ఏసీపీ చెబ్రోలు లక్ష్మీనారాయణ, ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ, అడిషనల్ ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్రెడ్డి, డీఎస్ఐ బి.జగధీశ్వర్రావు కేసు వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ పాతబస్తీ ఫతేదర్వాజ, మొయిన్పుర్ గుల్షాన్నగర్ ప్రాంతానికి చెందిన ఫఖ్రుద్దీన్ కుమారుడు మహ్మద్ యూనస్ అలియాస్ రోబో(32)వృత్తిరీత్యా కార్పెంటర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 5 తేదీ ఉదయం క్రైం పోలీసునని చెప్పి రూ.1.18లక్షలు లాక్కొని ఉడాయించాడు.
చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన ప్రతీప్(38) ఫల్ఛంద్(18) రామ్తేర్ (18) ముగ్గురు వృత్తిరీత్యా బోరింగ్ కంపెనీల్లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల జీవనాధారం కోసం కర్ణాటకకు వెళ్లి పనులు ముగించుకొని తిరిగి ఈ నెల 5వ తేదీన చత్తీస్ఘడ్ వెళ్లడానికి ఓ ప్రైవేట్ బస్సులో కాచిగూడకు వచ్చారు. అనంతరం ఇంటికి వెళ్లడానికి ఆటోలో ఇమ్లీబన్ బస్స్టేషన్ వెళ్తుండగా మార్గమధ్యంలో నింబోలిఅడ్డ రెడ్బిల్డింగ్ వద్ద మహ్మద్ యూనస్ ద్విచక్రవాహనంపై వచ్చి ఆటోను అడ్టుకున్నారు.
సమీపంలో దొంగతనం జరిగిందని, తానుు కాచిగూడ క్రైం పోలీసునని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకొని పోలీస్స్టేషన్కు రావాలని సూచించాడు. అనంతరం వారు పోలీస్స్టేషన్కు వస్తుండగా ఈ పోలీస్స్టేషన్ కాదనీ... సుల్తాన్ బజార్ పోలీస్స్టేషన్ని అని మాట మార్చి కోఠిలోని గుజరాత్గల్లీ వరకు ఆటోను తీసుకెళ్లి అక్కడి నుంచి వారి కళ్లు గప్పి పారిపోయాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి సమీపంలో నిందితుడు ఉన్నట్లు సమాచారం అందుకొని డీఎస్సై బి.జగధీశ్వర్రావు ఆధ్వర్యంలో మహ్మద్ యూనస్ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.80వేలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోని రిమాండ్కు తరలించారు.