సైకోగా మారిన సాప్ట్వేర్ ఇంజనీర్: పోలీసుల కాల్పుల్లో మృతి
హైదరాబాద్: కరీంనగర్లో సైకో హల్చల్ చేశాడు. పట్టణంలోని లక్ష్మీనగర్కు చెందిన బల్వీందర్ సింగ్ అలియాస్ బబ్లు అనే వ్యక్తి మంగళవారం ఉదయం కత్తితో ఇంటి నుంచి బయటకు వచ్చి స్థానికులపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న కరీంనగర్ వన్టౌన్ హెడ్ కానిస్టేబుల్ అలీ సిబ్బందితో వచ్చి సైకోను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
అయితే సైకో వారిపై కూడా దాడికి దిగాడు. హెడ్ కానిస్టేబుల్ అలీపై దాడి చేసిన సైకో అతని చేతి వేలు నరికేశాడు. దీంతో వెంటనే హెడ్ కానిస్టేబుల్ అలీని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కరీంనగర్ సీఐ విజయసారథి సైకో కాళ్లపై కాల్పులు జరిపి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయిన బల్వీందర్ను పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బల్వీందర్ మృతి చెందినట్లు సమాచారం. సైకో చేసిన దాడిలో హెడ్ కానిస్టేబుల్ అలీతో పాటు సుమారు 20 మందికి గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బల్వీందర్ దాడిలో గాయపడిన మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సైకో వీరంగంతో అక్కడి స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈరోజు ఉదయం వీరంగం సృష్టించిన బల్వీందర్ సింగ్కు సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
బల్వీందర్ సింగ్ ప్రస్తుతం బెంగళూరులో ఏడాదికి రూ.18 లక్షల జీతానికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే సివిల్స్ పరీక్షలు కూడా రాశాడు. అయితే అందులో ఫెయిల్ అయిన కారణందా తీవ్రమైన ఒత్తిడికి లోనై సైకోగా మారినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నాలుగు రోజుల కిందటే బెంగళూరు నుంచి సొంత ఇంటికొచ్చిన బల్వీందర్ సింగ్ ఉన్నట్టుండి మంగళవారం ఉదయం తండ్రి అమృత్ సింగ్, తల్లి బేబీ కౌర్లను కత్తితో పొడిచాడు. వారిని తీవ్రంగా దూషిస్తూ కత్తితో బయటికి వచ్చాడు. బయట నిలిపి ఉన్న మినీ వ్యాన్ అద్దాలు పగులగొట్టాడు. అటుగా వెళ్తున్న శ్రీమన్నారాయణ అనే ఆటో డ్రైవర్ను సైతం గాయపరిచాడు.
ఈ దాడిలో అక్కడికి చేరుకున్న పోలీసులపైనా దాడికి యత్నించాడు. దీంతో సీఐ విజయపార్ధసారథి తుపాకీతో బల్వీందర్సింగ్ కుడిభుజం, కాళ్లపై కాల్చారు. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డ బల్వీందర్ ఒక్కసారిగా ఉన్మాదిలా ప్రవర్తించటానికి గల కారణాలు తెలియరాలేదు. వివరాలు వెల్లడించేందుకు కుటుంబసభ్యులు నిరాకరిస్తున్నారు.