రూ. 300 కోట్లకు పైగా పడగెత్తాడు: పరారై ఎట్టకేలకు లొంగుబాటు
హైదరాబాద్: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తిన హెచ్ఎండిఎ ప్రణాళికా విభాగం డైరెక్టర్ పురుషోత్తమ రెడ్డి ఎట్టకేలకు లొంగిపోయాడు. ఆయన శుక్రవారం కోర్టు ముందు లొంగిపోయాడు.
ఆయన కొంత కాలంగా ఎసిబి నుంచి తప్పించుకుని తిరుగుతూ వచ్చాడు. పురుషోత్తమ రెడ్డికి ఎసిబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పురుషోత్తమ రెడ్డిని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎసిబి అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
రూ. 300 కోట్లకు పైగా ఆస్తులు
పురుషోత్తమ రెడ్డి రూ. 300 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. శుక్రవారంనాడు కూడా పురుషోత్తమ రెడ్డి ఇంటిలోనూ, బంధువుల ఇళ్లలోనూ ఎసిబి సోదాలు చేసింది. బ్యాంక్ లాకర్లలో భారీగా ఆభరణాలు ఉన్నట్లు ఇప్పటికే ఎసిబి అధికారులు గుర్తించారు.
ఇప్పటికే బినామీల అరెస్టు
పురుషోత్తమ రెడ్డి బినామీలు నిశాంత్ రెడ్డి, యాదవరెడ్డిలను ఇప్పటికే ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. ఎసిబి తనిఖీల నుంచి పురుషోత్తమ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నాడు. శుక్రవారంనాడు పురుషోత్తమ రెడ్డి నేరుగా కోర్టుకు వచ్చి లొంగిపయాడు.
పది రోజుల పాటు పరారీలో...
పురుషోత్తమ రెడ్డి ఇద్దరి బినామీలను ఎసిబి అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. దాదాపు పది రోజుల పాటు పురుషోత్తమ రెడ్డి హైదరాబాదు వదిలేసి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసు బృందాలు గాలించాయి. అతని ఫోన్ నెంబర్, వాట్సప్ కాల్స్ ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ఆయనే స్వయంగా వచ్చి లొంగిపోయాడు.
తనిఖీల సమయంలో పరారీ...
పురుషోత్తమ రెడ్డితో పాటు ఆయన మరో బినామీగా ఉన్న బావమరిది కూడా పారిపోయాడు. అనారోగ్యంతో ఉన్న ఆయన భార్య కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. పరారీ తర్వాత పురుషోత్తమ రెడ్డి తన ఇద్దరు కూతుళ్లతో టచ్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.