Surabhi Vani Devi : ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సురభి వాణీ దేవి...
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె,విద్యావేత్త సురభి వాణీదేవీ ఆదివారం(ఆగస్టు 29) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి వాణీ దేవితో ప్రమాణ స్వీకారం చేయించారు. భూపాల్ రెడ్డి ఛాంబర్లోనే ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్సీలు హాజరై వాణీ దేవికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ తరుపున సురభి వాణీ దేవి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సురభి వాణీదేవికి 1,89,339 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు సురభి వాణీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ విజయంతో మొదటిసారి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకున్నట్లయింది.

దుబ్బాక,జీహెచ్ఎంసీ మినహా అంతకుముందు జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ విజయం సాధించిన టీఆర్ఎస్కు... హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం మాత్రం అందకుండా ఉండిపోయింది. గతంలో ఇక్కడినుంచి టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి వ్యూహాత్మకంగా దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తెను ఇక్కడినుంచి బరిలో దింపడం కలిసొచ్చింది. అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం చేసినా... బలమైన అభ్యర్థిని పోటీకి పెట్టడంతో విజయం టీఆర్ఎస్నే వరించింది.

నిజానికి సురభి వాణీదేవీకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి కేసీఆర్ ఆమెను బలిపశువును చేయబోతున్నారన్న విమర్శలు వినిపించాయి. ఆమె మరో శంకరమ్మ(తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత చారి తల్లి)లా మిగిలిపోతుందని చాలామంది భావించారు. గతంలో శంకరమ్మను హుజూర్నగర్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీకి దింపి కేసీఆర్ ఆమెను బలిపశువును చేశారన్న విమర్శలు వినిపించాయి.
అక్కడ టీఆర్ఎస్కు బలం లేదని తెలిసే శంకరమ్మకు టికెట్ ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సురభి వాణి దేవి విషయంలోనూ ఇలాంటి విమర్శలే వ్యక్తమయ్యాయి.టీఆర్ఎస్కు బలం లేని చోట పీవీ కుమార్తెను పోటీకి దింపి.. కేసీఆర్ ఆమెను బలి చేయబోతున్నారని చాలామంది భావించారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ సిట్టింగ్ అభ్యర్థి రామచంద్రరావుపై ఆమె విజయం సాధించారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానానికి మంత్రులు హరీశ్ రావు,ప్రశాంత్ రెడ్డి,గంగుల కమలాకర్లు ఇన్చార్జిలుగా నిరంతరం శ్రమించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను ఈ ముగ్గురు సక్సెస్ అయ్యారు. అటు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న,మూడో స్థానంలో కోదండరాం నిలిచారు.












Click it and Unblock the Notifications