'టెర్రరిస్ట్స్ చనిపోతే సీబీఐ విచారణా?': అసద్కు ప్రశ్న
హైదరాబాద్: ఉగ్రవాదులకు సహకరించే వారితో పాటు, వారి పైన సానుభూతి చూపించే వారు కూడా దేశద్రోహులేనని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఉగ్రవాదులు ఎన్ కౌంటర్లో మరణిస్తే వారికి మద్దతుగా మజ్లిస్ పార్టీ వ్యాఖ్యలు చేయడం అర్థరహిదమన్నారు.
హైదరాబాదు ఇలా కావడానికి కారణం మజ్లిస్ కాదా అని ప్రశ్నించారు. జనగామ - ఆలేరు ఎన్కౌంటర్ను అసద్ ప్రశ్నించడం మత రాజకీయమేనని ధ్వజమెత్తారు. దీని పైన వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. దత్తాత్రేయ గురువారం నాడు పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.
'చిన్న తరహా మారణాయుధాల అక్రమ వ్యాపారం-దిగుమతి'పై జరిగిన సదస్సుకు, బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర ప్రథమ వర్ధంతికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గవర్నర్ నరసింహన్ను కూడా కలిశారు.

బీజేపీ కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని, కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పార్టీకి ఆలె నరేంద్ర చేసిన సేవలు అనన్యసామాన్యమైనవని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రెండు ప్రధాన నిర్ణయాలను తీసుకుందని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ పెంచాలని చాలాకాలంగా ఎంతో మంది ఉద్యమిస్తున్నారని ఇన్నాళ్లకు కేంద్రప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు.
అకాల వర్షాలతో పాటు పలు కారణాలతో 40 నుండి 50 శాతం పంటలు పోతున్నాయని, కేంద్రం పరిహారాన్ని 50 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయం అసాధారణమైనదని అన్నారు.
నగరంలో ఉగ్రవాదుల దాడుల్లో పోలీసులు, అమాయకులు చనిపోయినప్పుడు మజ్లిస్ ఎందుకు స్పందించలేదన్నారు. ఉగ్రవాదులు హతమైనప్పుడు సీబీఐ విచారణ కోరడం విడ్డూరమన్నారు. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ పైన ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications