ఎమ్మెల్యే పదవి గడ్డిపోచ, అందుకే జగన్ని కలిశా: బాబుకు కృష్ణయ్య షాక్
హైదరాబాద్: తనకు ఎమ్మెల్యే పదవి గడ్డిపోచతో సమానమని, తాను ఏ పార్టీలో భాగం కాదని, తనకు పార్టీ పెట్టే ఆలోచన ఉందని, అవసరమైనప్పుడు ముందుకు వెళ్తానని బిసి నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటేనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని చెప్పారు.
ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు షాక్ అని చెప్పవచ్చు. తాను ఏ పార్టీలోను భాగం కాదన్నారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి పదవి ఇస్తానంటే నిరాకరించానని చెప్పారు. బీసీల సంక్షేమం నేపథ్యంలో తాను వైసిపి అధినేత జగన్ను కలిశానని చెప్పారు.
బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ఇందుకోసం ప్రధాని మోడీకి లేఖ రాయాలని జగన్కు విజ్ఞప్తి చేశానని, అందుకే ఆయనను కలిశానని చెప్పారు. తాను ఎవరికీ భయపడేది లేదని, ప్రాణం పోయినా ఎవరికీ అమ్ముడు పోనని చెప్పారు. తాను ఎప్పుడూ సొంత చరిష్మా కోసం తాపత్రయపడలేదన్నారు.
బీసీ సంక్షేమం కోసం తన డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పారు. అధికారం ఎప్పుడూ తన లక్ష్యం కాదన్నారు. అధికారంలో ఉన్నా ఏ పార్టీ అయినా బీసీ సంక్షేమమే తన లక్ష్యమన్నారు. అసెంబ్లీలోను గళం విప్పుతానని చెప్పారు. పార్టీ పెట్టే ఆలోచన ఉందని, అవసరమైనప్పుడు ముందుకు పోతానని చెప్పారు.
బీసీలకు ఇన్ని ప్రయోజనాలు తన వల్లనే వచ్చాయన్నారు. డబ్బుల కోసం, ఇతర పదవుల కోసం పార్టీ మారటం సరికాదన్నారు. తాను నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానని, అందుకే పార్టీ మారనని చెప్పారు. నేను టిడిపిలోనే ఉంటూ, బీసీల కోసం ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నిలదీస్తానని చెప్పారు.