రేవంత్ను కల్సిన కృష్ణయ్య: కేసీఆర్తో కేంద్రమంత్రి, ప్రెస్ కౌన్సిల్కు టీ న్యూస్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఆ పార్టీకి చెందిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య సోమవారం కలిశారు. రేవంత్ రెడ్డిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ఫోన్లు ట్యాప్ చేయలేదు: నాయిని
తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఫోన్లు ట్యాప్ చేసినట్లు రుజువు అయితే తాము దేనికైనా సిద్ధమని ప్రకటించారు. ఆరోపణలు రుజువు చేయకుంటే జైలుకు వెళ్లేందుకు వారు సిద్ధమా అని సవాల్ చేశారు. మైండ్ ట్యాపింగులే కానీ ఫోన్ ట్యాపింగులు లేవన్నారు.
రాష్ట్రంలో కరెంట్ సమస్యను గురించి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో మంచినీటి కష్టాలను తీర్చుతామన్నారు. గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చుతామన్నారు. ఈ విషయంలో వంద శాతం అంకితభావంతో పనిచేస్తున్నామన్నారు.
కేసీఆర్ను కలిసిన కేంద్రమంత్రి
కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారని తెలుస్తోంది.
పీసీఐ దృష్టికి టీ న్యూస్ నోటీసుల వ్యవహారం
టీ న్యూస్కు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చిన అంశాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి ఢిల్లీ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీసుకెళ్లింది. ఢిల్లీ యూనిట్ తరపున ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ చంద్రమౌళి ప్రసాద్కు జర్నలిస్టులు మెమోరాండం అందజేశారు. అదే విధంగా టీ న్యూస్ సీఈవో నారాయణ రెడ్డి రాసిన లేఖను జర్నలిస్టులు చైర్మన్కు అందించారు.