సీఎం సొంత జిల్లా నుంచి పీఎం సొంత రాష్ట్రానికి: గుజరాత్ చీఫ్ జస్టిస్గా సుభాష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సొంత జిల్లా మెదక్ కు చెందిన వ్యక్తి, ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఉమ్మడి హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి.. పదోన్నతిపై గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా నియమితులయ్యారు. ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ఆమోదముద్ర వేశారు.
ఆ ఉత్తర్వుల ప్రతిని జస్టిస్ సుభాష్రెడ్డి అందుకున్నారు. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ జయంత్ ఎం పటేల్.. కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లనున్నారు. ఆ తర్వాత జస్టిస్ సుభాష్రెడ్డి గుజరాత్ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపడతారు.
కుటుంబ నేపథ్యం
1957లో మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామంలోని సాధారణ వ్యవసాయ కుటుంబంలో సుభాష్రెడ్డి జన్మించారు. ఆర్ జగన్నాథ్రెడ్డి, విశాలారెడ్డి దంపతులకు ఆయన రెండవ సంతానం. శంకరంపేటలో పదో తరగతి వరకు చదివిన ఆయన హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు.
ఉస్మానియా నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. 1980 అక్టోబర్ 30న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు లోకాయుక్తగా సేవలందిస్తున్న జస్టిస్ బి సుభాషణ్రెడ్డి వద్ద న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధమైన వ్యవహారాలలో నిపుణులుగా పేరుతెచ్చుకున్నారు.
ఎస్వీ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూలకు స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్కు 2001-02 సంవత్సరానికి అధ్యక్షుడిగా (ఏకగ్రీవం) ఎన్నికై సేవలందించారు.
2002 డిసెంబరు 02న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసు అథార్టీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా సేవలందిస్తున్నారు.
న్యాయవాదుల హర్షం
మెదక్ జిల్లాకు చెందిన జడ్జి సుభాష్రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడంపై జిల్లా న్యాయవాదుల జేఏసీ అధ్యక్షులు వీ ప్రతాప్రెడ్డి, మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జనార్దన్రెడ్డి, లక్ష్మణ్కుమార్, న్యాయవాదులు పోచయ్య, హార్కార్ జగదీశ్వర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.