‘కేటీఆర్ను ‘ఫ్యూచర్ సీఎం’ అని పిలుచుకోవాలని ఉంది’
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామరావుపై టాలీవుడ్ హాస్య నటుడు రఘుబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చిన 'జాగ్వార్' తెలుగు చిత్ర గీతాలను ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాగ్వార్ ప్రచార చిత్రం, పాటల్లో నిఖిల్ పడిన కష్టం కనిపిస్తున్నదని అన్నారు.
'జాగ్వార్' చిత్రంతో కన్నడ, తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశిస్తున్న మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు హీరో నిఖిల్కుమార్కు మంచి పేరు తెచ్చిపెట్టాలని మంత్రి ఆకాంక్షించారు.
భాషాభేదాలతో నిమిత్తం లేకుండా ప్రతిభను ప్రోత్సహించడంలో తెలుగు ప్రజలు ముందుంటారని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తాతగారు దేవెగౌడ, తల్లిదండ్రుల పేరును అతను నిలబెట్టుతాడనే నమ్మకం ఉందని అన్నారు.
ఫ్యూచర్ సీఎం అంటూ..
ఈ కార్యక్రమంలో హాస్యనటుడు రఘుబాబు మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన డైనమిక్ లీడర్ మంత్రి కేటీఆర్ అని అన్నారు. ఆయనను మొదటిసారి ప్రత్యక్షంగా చూడటం ఈ సభలోనేనని చెప్పారు. అంతేగాక,'ఎక్కువ మాట్లాడుతున్నాను అని అనుకోకపోతే మనస్ఫూర్తిగా ఆయనను ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ అని పిలుచుకోవాలని ఉంది' అని వ్యాఖ్యనించారు.
కాగా, నిఖిల్ను ఆశీర్వదించడానికి వచ్చిన మంత్రి కేటీఆర్తోపాటు రాజకీయ, సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తునానని దేవెగౌడ అన్నారు. అక్టోబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నదని హీరో నిఖిల్కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన భార్య అనితా కుమారస్వామి, కథ అందించిన విజయేంద్రప్రసాద్, మహదేవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధుకు దేవెగౌడ పది లక్షల రూపాయల చెక్కును అందజేశారు.