కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే, తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయ్: రఘునందన్ రావు, రాజా సింగ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్లోని ధర్నా చౌక్ వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు.
కేసీఆర్ అబద్ధాలు నిరూపిస్తామనే సభ నుంచి పంపించారు: రఘునందన్
ఈ సందర్భంగా రఘనందన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారని అడిగామని, తాము తమ స్థానాల్లో నల్ల కండువా వేసుకుని నిల్చున్నామని.. అయినా అన్యాయంగా తమను సస్పెండ్ చేశారని రఘునందన్ రావు టీఆర్ఎస్ సర్కారుపై మండిపడ్డారు. తాము సభలో ఉంటే కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్దాలని నిరూపిస్తామనే తమను సభ నుంచి బయటకు పంపారని అన్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు: రఘునందన్ రావు
బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్.. కేసీఆర్ను భట్టి పొగుడుకున్నారని రఘునందన్ రావు తెలిపారు. భవిష్యత్తులో కాంగ్రెస్, టీఆర్ఎస్ లు నాణేనికి బొమ్మా బొరుసులా ఉంటాయన్నారు. భట్టి బాగా మాట్లాడుతున్నారని.. కేసీఆర్ పార్లమెంటుకు పంపిస్తారట.. ఏ పార్టీ నుంచి పంపిస్తారోనని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్లేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని.. రాష్ట్ర పార్టీ అనుమతి తీసుకుని తాము ముగ్గురం అన్ని జిల్లాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలు చేపడతామని రఘునందన్ రావు తెలిపారు.
ఢిల్లీలో బీజేపీ రాజ్యం ఉందంటూ రాజా సింగ్
అనంతరం ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. కేసీఆర్తో యుద్ధానికి బీజేపీ సైనికులంతా సిద్ధం కావాలని రాజా సింగ్ పిలుపునిచ్చారు. అక్రమ కేసులతో బీజేపీ నేతలను, కార్యకర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, కేసీఆర్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవాలని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ రాజ్యం ఉంటే.. ఢిల్లీలో బీజేపీ రాజ్యం ఉందని గుర్తుంచుకోవాలని రాజాసింగ్ అన్నారు.
తెలంగాణకు బుల్డోజర్లు వస్తున్నాయంటూ రాజా సింగ్
తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి పాలనను అణచివేసేందుకు రాష్ట్రానికి అమిత్ షా బుల్డోజర్లను గిఫ్ట్గా పంపిస్తున్నారని అన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక్కో బుల్డోజర్ రాబోతోందని ఆయన చెప్పారు. ఈటలను ఆడుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రాష్ట బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యక్తులు కాదని, శక్తులని, వారి సారథ్యంలో కేసీఆర్పై కొట్లాడుతామని చెప్పారు. రావణ వధ మాదిరిగా.. టిప్రుల్ ఆర్ చేతిలో సీఎం కేసీఆర్కు అదే గతి పడుతుందని, తెలంగాణలో ఆయన పాలనకు త్వరలోనే అంతం తప్పదని రాజా సింగ్ జోస్యం చెప్పారు.