కేంద్రం నిధులపై కేసీఆర్ అవాస్తవాలు: రఘునందన్ రావు, కేటీఆర్ ప్రెస్మీట్ ఎందుకు?
హైదరాబాద్: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కేంద్రం సాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్రానికి ఎస్డీఆర్ఎఫ్ నిధుల రూపంలో 2021-2022 సంవత్సరానికి గానూ కేంద్రం 75 శాతం వాటాగా దాదాపు రూ. 359 కోట్లు ఇస్తే.. ఒక్క రూపాయి ఇవ్వలేదంటూ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు.
2021-2022 సంవత్సరానికి ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో రాష్ట్ర వాటా కేవలం 25 శాతం మాత్రమేనని.. అంటే సుమారు రూ. 120 కోట్ల కేంద్రం నిధులతో కలిపి ఖర్చు పెట్టాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని రఘనందన్ రావు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన రూ. 359 కోట్ల నిధులనే రెండు విడతలుగా పంట నష్టపోయిన రైతులకు చెల్లించారని.. ఇప్పుడేమో కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ఇక ఎన్నికలు వస్తున్నాయనగానే సీఎం కేసీఆర్కు కౌలు రైతులు గుర్తొచ్చారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ కౌలు రైతులు లేరు.. కౌలు రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వం అని కుండబద్దలు కొట్టారని.. కానీ, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నందున వారిపై ప్రేమ పుట్టిందని ఎద్దేవా చేశారు. 2014 నుంచి ఇప్పటి దాక రాష్ట్ర ప్రభుత్వం ఎంత మంది కౌలు రైతులను గుర్తించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత జులై 17న ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు గుర్తు చేసిన రఘునందన్.. వారిలో ఎంతమందికి నష్టపరిహారం ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కురిసిన అకాల వర్షాలకు విదేశీ కుట్ర అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన మండిపడ్డారు. విదేశీ కుట్రను సిట్ వేసి తేల్చారా? అని చురకలంటించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై తనకేం సంబంధం అంటున్న కేటీఆర్.. పెత్తనం మీదేసుకుని ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. మీడియాపై అహంకారం ఎందుకు ప్రదర్శించారని నిలదీశారు. టీఎస్ పీఎస్సీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి ఎందుకు మాట్లాడలేదన్నారు.












Click it and Unblock the Notifications