అప్పటి పరిస్థితే: ఇందిరలానే సంగారెడ్డి నుంచి రాహుల్ చరిత్ర తిరగ రాస్తారా?
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం సంగారెడ్డిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ సంగారెడ్డి ప్రజలను నాలుగు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లింది.
సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం సంగారెడ్డిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ సంగారెడ్డి ప్రజలను నాలుగు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లింది. తెలంగాణ ప్రజాగర్జన సభ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని గుర్తు చేశారు రాహుల్. సరిగ్గా 38 ఏళ్ల క్రితం 1979లో అదే గ్రౌండ్లో రాహుల్ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సభ నిర్వహించడం గమనార్హం.
ఇందిరను గుర్తు చేసుకున్నారు..
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ కేడర్, స్థానికులు నాటి సభ గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇందిర, రాహుల్ సభలకు ఉన్న పోలికల గురించి చర్చించుకోవడం కనిపించింది. జనతా పార్టీ హవాతో 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో 1979లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
బంపర్ మెజార్టీ సాధించిన ఇందిర
మెదక్ జిల్లాలో ప్రస్తుతం రాహుల్ సభ జరిగిన చోటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఫలితంగా 1980 ఎన్నికల్లో మెదక్ లోక్ సభస్థానమైన సంగారెడ్డిలో విజయదుందుభి మోగించిన ఇందిరా గాంధీ బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు.
చరిత్ర తిరగరాస్తారా?
సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అప్పట్లానే ఉంది. 2014 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. రాహుల్ సభకు హాజరైన వారిలో చాలామంది స్థానికులు నాటి ఇందిర సభను గుర్తు చేస్తూ, నాడు ఇందిరలో కనిపించిన ఆవేశం, ఉత్సాహం, మాట తీరు నేడు రాహుల్లోనూ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, ఇందిరా సృష్టించిన చరిత్రను రాహుల్ తిరిగి కొనసాగిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
నవ్వులు పూయించిన రాహుల్
జగ్గారెడ్డి గట్టోడు, మొండోడు, వన్ మెన్ షో చేసిండు.. కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టుకుని ఏర్పాటు చేసిండు అంటూ ఎంపీ హనుమంతరావు ప్రజా గర్జన సభ ఏర్పట్ల గురించి వేదికపై రాహుల్ వద్ద ప్రశంసించారు. దీంతో సభ ఏర్పాట్లకు మీరేం ఇచ్చారని రాహుల్.. వీహెచ్ ను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తన దగ్గర ఏముంది? ఇచ్చేందుకు అని వీహెచ్ చెప్పారు. మీ చేతికి ఉన్న ఉన్న బంగారు బ్రేస్ లెట్ను జగ్గారెడ్డికి ఇచ్చేయండని రాహుల్ అనగానే.. అక్కడున్న జగ్గారెడ్డి, ఉత్తమ్ తోపాటు వీహెచ్ ఒక్కసారిగా నవ్వేశారు.