రాహుల్ను ప్రతిపక్ష నేతగా చూడాలనుకుంటోన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy: దేశ రాజధానిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షించుకోనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్కు అతి సమీపంలో నిలిచిపోయిన నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతోంది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖర్గే, మాజీ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రులు వీరప్ప మొయిలీ, భూపేష్ బఘేల్, అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత రాజీవ్ శుక్లా.. పలువురు సీడబ్ల్యూసీ సభ్యులు ఇందులో పాల్గన్నారు.

సమావేశం ప్రారంభం కావడానికి ముందు రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సీడబ్ల్యూసీ అజెండా ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదని అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించాలని 140 కోట్ల మంది దేశ ప్రజలు ఆకాంక్షిస్తోన్నారని, తాను కూడా అదే కోరుకుంటోన్నారని చెప్పారు.
ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రాహుల్ గాంధీ అవిశ్రాంతంగా పోరాడారని గుర్తు చేశారు. రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలు.. ఇలా అన్ని వర్గాలు కూడా మోదీ ప్రభుత్వంలో మోసానికి గురయ్యాయని పేర్కొన్నారు. అలాంటి స్థితిలో వారందరి తరఫున రాహుల్ గాంధీ నిరంతరం పోరాడారని చెప్పారు.

ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్లు భారీగా పెరిగాయని అన్నారు. గతంలో నాలుగు సీట్లు ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య ఎనిమిదికి పెరిగిందని చెప్పారు. అసెంబ్లీతో పోల్చుకుంటే ఓట్ల శాతం కూడా 39.5 నుంచి 41 శాతానికి పెరిగిందని అన్నారు. మోదీ గ్యారంటీ వారంటీ ఖతం అయిందని విమర్శించారు.
పదేళ్ల పాటు వారణాశికి ప్రాతినిథ్యాన్ని వహించిన మోదీకి వచ్చిన ఓట్ల శాతం ఎంత?, ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎన్ని సీట్లు దక్కాయి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో సీట్ల సంఖ్యను భారీగా కోల్పోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ మోదీ తన పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications