గుడ్ న్యూస్: తెలంగాణాలో 8వేల కోట్ల రైల్వే పనులతో ఆ ప్రాంతానికి మహర్దశ!
దేశవ్యాప్తంగా రైల్వే అభివృద్ధికి ఇండియన్ రైల్వే చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పైన ఫోకస్ చేస్తున్న భారతీయ రైల్వే అనేక కీలక ప్రాజెక్టులను ఇచ్చి రెండు రాష్ట్రాలలోనూ ప్రగతి పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరాల జల్లు కురిపించిన భారతీయ రైల్వే అనేక కీలక ప్రాజెక్టులను ఇచ్చి అభివృద్ధికి కీలకంగా మారింది.
ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే అభివృద్ధి పనులు
కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల విలువైన పనులను రైల్వే చేస్తోంది. ఇప్పటికే వీటిలో కొన్ని పనులు పూర్తికాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకొన్ని పనులు ప్రాథమిక దశలో ఉన్నాయి. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ పరిధిలో వరంగల్ జిల్లా ప్రజల కలలు సహకారం చేసేలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

కోచ్ ఫ్యాక్టరీ పనులు 70 శాతం పూర్తి
ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఇప్పటి వరకు 70 శాతం పూర్తయ్యాయి. అయోధ్య పురం సమీపంలో నిర్మాణం చేస్తున్న ఈ కోచ్ ఫ్యాక్టరీ లో అన్ని రకాల కోచ్ లు తయారవుతాయి. దీనికోసం ప్రస్తుత 80 శాతం నిధులు వెచ్చించగా, వచ్చే సంవత్సరం నుండి ఇది ఉత్పత్తిని కూడా ప్రారంభిస్తుందని అంచనా.
బల్లార్షా మార్గంలో మూడో లైన్ పనులు
బల్లార్షా మార్గంలో మూడవ రైల్వే లైన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికి మొత్తం 202 కిలోమీటర్ల మార్గంలో 159 కిలోమీటర్లు పూర్తి కాగా, మిగతా పనులు సాగుతున్నాయి. ఇందులో 151 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉండడంతో పనులు చక చక జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ మార్గంలో నాలుగవ లైను నిర్మాణానికి కూడా కేంద్రం దృష్టి సారించింది.
విజయవాడ సికింద్రాబాద్ మధ్య అదనపు రైల్వే ట్రాక్ల నిర్మాణం
ఇదిలా ఉంటే విజయవాడ సికింద్రాబాద్ మధ్య అదనపు రైల్వే ట్రాక్ల నిర్మాణం కూడా కొనసాగుతుంది. సికింద్రాబాద్ కాజీపేట మధ్య అదనంగా మరో రెండు లైన్లకు ప్రతిపాదనలు ఉన్న క్రమంలో వచ్చే బడ్జెట్లో నిధులు మంజూరు చేసి స్థల సేకరణ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు ప్రతిపాదన ఉంది. దీనికోసం స్థల సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అమృత్ భారత్ పథకం కింద రైల్వేస్టేషన్ల అభివృద్ధి
ఒకవేళ అక్కడ ఏదైనా సమస్య వస్తే కాజీపేట సమీపంలోని డిపో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు అమృత్ భారత్ పథకం కింద ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తి చేసుకుని పునః ప్రారంభానికి నోచుకోగా, కాజీపేట, మహబూబాబాద్, జనగామ స్టేషన్లలో పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులివే
ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రూ.521 కోట్లు, కాజీపేట- బల్లార్షా మూడు లైనుకు రూ. 2063 కోట్లు, వరంగల్ - విజయవాడ 3వ లైనుకు రూ.1953 కోట్లు, కాజీపేట - సికింద్రాబాద్ మూడు నాలుగు లైన్లకు రూ.2837 కోట్లు, మహబూబాబాద్ మెగా డిపోకు రూ.908 కోట్ల నిధులను కేటాయించారు. మొత్తంగా ఎనిమిది వేల కోట్ల నిధులతో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులు ఈ ప్రాంత రూపు రేఖలను మార్చడంతో పాటు అనేక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications