రైల్వే ఉద్యోగుల ఆరోగ్యంతో ఆటలు.. కొనని మందులు కొన్నట్లు చూపి కోట్లు కాజేసిన కేటుగాళ్లు
హైదరాబాద్ : కంచె చేను మేసిన చందంగా రైల్వే శాఖ ఉద్యోగి భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టించాడు. కొనని మందులు కొన్నట్లు చూపి కోట్లు కాజేశాడు. అవసరమైన మందులు అందుబాటులో ఉంచక రైల్వే ఉద్యోగుల ఆరోగ్యంతో ఆటలాడాడు. ఫేక్ బిల్లులు సృష్టించి పంగనామం పెట్టిన ఘనుడు ఏకంగా మూడు బోగస్ కంపెనీలు సృష్టించి కోట్లు కొల్లగొట్టాడు. అంతా సాఫీగా జరిగిపోయిందనుకున్న సమయంలో విజిలెన్స్ శాఖ తనిఖీలు అతని బండారం బయటపడింది. తాను సృష్టించిన ఫేక్ బిల్లులే అతన్ని పట్టించాయి.
పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మైనర్లు రయ్ రయ్.. సీఐకి అక్షింతలు, మెమో జారీ
మూడు బోగస్ కంపెనీల సృష్టి
ఫేక్ బిల్లులతో రైల్వేకు శఠగోపం పెట్టిన గణేశ్ కుమార్ రైల్వే ఉద్యోగి. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజరీ కార్యాలయంలో అకౌంట్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగుల కోసం రైల్వే శాఖ మెడికల్ ఏజెన్సీల నుంచి మందులు కొనుగోలు చేస్తుంది. ఈ వ్యవహారాలను గణేశ్ చూసుకునేవాడు. భారీ మొత్తంలో నగదు కాజేయొచ్చన్న ఆశతో పెద్ద ప్లానే వేశాడు. గణేశ్ సాయి బాలాజీ, శ్రీ వినాయక ఏజెన్సీస్, శ్రీ తిరుమల ఎంటర్ప్రైజెస్ పేరుతో బోగస్ మెడికల్ ఏజెన్సీలను సృష్టించాడు.
31 ఫేక్ బిల్లులతో రూ.2.20కోట్లకు టోకరా
గణేశ్ తాను సృష్టించిన బోగస్ కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేసినట్లు 31 నకిలీ ఫార్మా బిల్లులు తయారుచేశాడు. తన ఇంటిగ్రేటెడ్ పేరోల్ అండ్ అకౌంటింగ్ సిస్టం యూజర్ అకౌంట్ నుంచి రూ.2.20కోట్ల రైల్వే నిధులను మూడు బోగస్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశాడు. తనపై ఎవరికీ అనుమానం రాదని అనుకున్నాడు. అయితే అక్కడే డామిట్ కథ అడ్డం తిరిగింది. ఫేక్ బిల్లుల్లో జీఎస్టీ నెంబర్ లేకపోవడం గణేశ్ కొంపముంచింది.
పలు సెక్షన్ల కింద కేసు
గణేశ్ కుమార్ సమర్పించిన బిల్లుల్లో జీఎస్టీ నెంబర్ లేదన్న విషయం రైల్వే విజిలెన్స్ శాఖ తనిఖీల్లో తేలింది. దీంతో ఆ శాఖ అధికారులు సీబీఐకు ఫిర్యాదు చేశారు. విచారణలో గణేశ్ అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. దీంతో సీబీఐ అధికారులు ఐపీసీ సెక్షన్ 420, 409, 468, 471తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(1)ఏ, 13(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరు రైల్వే అధికారుల పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సాక్ష్యాధారాలు సేకరించి వారిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు అధికారులు చెప్పారు. అటు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన గణేశ్ కుమార్పై రైల్వే శాఖ వేటు వేసింది.