రైల్వే ప్రయాణికులకు రూ.20కే ఆహారం
రైలులో ప్రయాణం చేసేటప్పుడు రిజర్వుడు కోచ్ లో ప్రయాణించేవారికి ప్యాంట్రీకార్ నుంచి ఆహారం వస్తుంది. అది రుచిగా ఉన్నా, లేకపోయినా కడుపు నింపుకోవడానికి తినక తప్పదు. తెల్ల అన్నం, పప్పు, ఇంకా ఏవో రెండు రకాలిస్తారో లేదో కానీ రూ.120 వసూలు చేస్తారు. అది కూడా గ్రాముల లెక్కన లెక్కబెట్టి అమ్ముతారు. చపాతీ అంటే అందులో నాలుగు పుల్కాల్లాంటివి ఉంటాయి. రూ.70 తీసుకుంటారు. ప్రయాణికుల కోసం నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాం.. కాంట్రాక్టర్లందరికీ కఠినంగా చెప్పామంటూ రైల్వే శాఖ ఎప్పుడూ ఊదరగొడుతుంది.
అధికారులకే స్పష్టంగా తెలియదు..
వారి సంగతి పక్కన పెడితే అన్ రిజర్వుడు బోగీల్లో ప్రయాణించేవారి సంగతి ఏమిటంటే.. ఎవరూ చెప్పలేరు. ప్లాట్ ఫాంపై రైలు ఆగినప్పుడు వెండర్లు అమ్మేవి కొనుగోలు చేసి తినడమే. అది బాగున్నా, బాగోలేకపోయినా.. తినక తప్పదు. బాలేకపోతే డబ్బులు దండగ. డబ్బులు ఊరక పోయాయే అని బాధ. అయితే అన్ రిజర్వుడు బోగీల్లో ప్రయాణించేవారి కోసం రైల్వే ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.20కే ఆహారాన్ని అందిస్తారు. వాస్తవానికి దీన్ని ఎప్పుడో ప్రారంభించినా అది సరిగా అమలవుతుందా? లేదా? ప్రయాణికులకు రూ.20 కే ఆహారం అందుతుందా? అంటే అధికారులకే స్పష్టంగా తెలియదు.

సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలి కదా
విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, సికింద్రాబాద్, హైదరాబాద్, ఖాజీపేట, గుంటూరు, రేణిగుంట, రాజమండ్రి, నిజామాబాద్.. తదితర స్టేషన్లలో ఈ ఆహారాన్ని అందుబాటులోకి తేనున్నట్లు రైల్వే ఎప్పుడో ప్రకటించింది. చౌక ఆహార దుకాణాలద్వారా 200 గ్రాముల లెమన్ రైస్, పప్పు కిచిడీ, పూరీ-పరోటా, పెరుగన్నం లాంటివి ఉంటాయి. ప్రయాణికులు కోరుకున్నవి ఎంపిక చేసుకోవచ్చు. రైలు ఆగినప్పుడు చౌక ఆహార దుకాణాలద్వారా వీటిని అమ్ముతున్నారా? లేదా? అనే పర్యవేక్షణ కొరవడింది.
ఈ పథకం సమర్థంగా అమలైతే హౌరా, తిరువనంతపురం, భువనేశ్వర్, ఢిల్లీ, జైపూర్ లాంటి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అన్ రిజర్వుడు ప్రయాణికులకు మంచి ఆహారం దొరుకుతుంది. అది దొరికేలా చూసి వారి ఆకలిని తీర్చాల్సిన బాధ్యత కూడా భారతీయ రైల్వేపైనే ఉంది. అంటే.. పథకాన్ని సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తే చాలు.












Click it and Unblock the Notifications