హైదరాబాద్ మెట్రోకు భారీగా పెరిగిన ప్రయాణికుల తాకిడి: స్టేషన్లు, రైళ్లు కిటకిట, వినతులు
హైదరాబాద్: ఐదు రోజులుగా నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలో ఎంఎంటీఎస్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో నగరంలోని రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు వారి కార్యాలయాలకు వెళ్లేందుకు వ్యయప్రయాసలు తప్పడం లేదు.
ఎంఎంటీఎస్ సేవలు నిలిచపోవడంతో ఎక్కువ మంది హైదరాబాద్ మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మెట్రో స్టేషన్లకు కూడా ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది. ప్రస్తుతం నడుపుతున్న మెట్రో రైళ్లు సరిపోవడం లేదు. కిక్కిరిసి మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు మెట్రోస్టేషన్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ క్రమంలో మెట్రో అధికారులు మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. లేదంటే తాము ఆఫీసులకు చేరుకోవడం గానీ, ఇళ్లకు చేరుకోవడం గానీ చాలా ఆలస్యమైపోతుందని చెబుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది మెట్రో రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రోకు ఎప్పుడూ లేనంతగా రద్దీగా కనిపిస్తోంది.
మరోవైపు, కొన్ని కంపెనీలు వర్షాల కారణంగా వర్క్ హోం అనుమతిస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా మూడు రోజులపాటు విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది అధికార యంత్రాంగం. తెలంగాణ జిల్లాల్లోనూ భారీ వర్షాలతో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.