హైదరాబాద్ చల్లబడినట్టేనా?: నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమికి జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జడుసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చారంటే శరీరం నిండా చెమటలు. నెత్తిన మండే సూర్యుడు. నాలుగు అడుగులు వేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ భానుడి ప్రతాపంతో హైదరాబాదు జంట నగరాల్లోని పరిస్థితి. ఇలా ఎండలతో అల్లాడిపోతున్న హైదరాబాద్ నగర ప్రజలపై వరుణ దేవుడు కరుణించాడు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. చంపాపేట్, సైదాబాద్ సహా దిల్సుఖ్నగర్, పాతబస్తీ, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి.

గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎండ దెబ్బకు విలవిలలాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో మంగళవారం ఒక్కసారిగా వాతావరణ చల్లబడటంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. మొన్న కురిసిన ఓ మోస్తరు వర్షంతో వాతావరణం కాస్తంత చల్లబడినట్టే చల్లబడి... మళ్లీ వేడెక్కింది. ఈరోజు మళ్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే వడగాలుల దెబ్బకు 60 మంది మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లాలో 14 మంది, వరంగల్లో 14 మంది మృత్యువాత పడ్డారు. నల్గొండ జిల్లాలో 11 మంది చనిపోయారు. కరీంనగర్ జిల్లాలో 8 మంది, మహబూబ్నగర్ జిల్లాలో ఆరుగురు కన్నుమూశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు, మెదక్ జిల్లాలో ఇద్దరు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. సోమవారం మధ్యాహ్నం తెలంగాణలోని నల్గొండ జిల్లా చౌటుప్పల్లో 47డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం తెలంగాణలోని రామగుండంలో 45, ఏపీలో కర్నూలులో 45.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications