రోడ్డుపై నడుచుకుంటూ రాజాసింగ్: మొరాయిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం
హైదరాబాద్: ఇంటెలిజెన్స్ అధికారులు తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని మండిపడ్డారు.
ఉగ్రవాదుల ముప్పు ఉన్నా ఇలాంటి వాహనమా?: రాజా సింగ్
ముఖ్యమైన పనులపై బయటకు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో వాహనం ఆగిపోతోందని రాజా సింగ్ తెలిపారు. ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచివున్న తనకు ఇలాంటి వాహనం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తన ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని వ్యాఖ్యానించారు. కండీషన్ లో ఉన్న వాహనం ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చాలని ఇంటిలిజెన్స్ ఐజీకి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని రాజాసింగ్ ఆరోపించారు. ప్రాణహాని ఉన్న తన పట్ల ప్రభుత్వ తీరు సరిగా లేదని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆటోలోనే కోర్టుకు వెళ్లానంటూ రాజా సింగ్
కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. నాలుగు నెలల క్రితం రోడ్డు మధ్యలో ఆ వాహనం ఆగిపోతే ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించాను. మరమ్మతులు చేసి అదే వాహనాన్ని మళ్లీ ఇచ్చారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ ఆగిపోయింది. గన్మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లాను. అఫ్జల్గంజ్ వద్ద మరోసారి ఆగిపోయింది. అప్పుడు సొంత వాహనం రప్పించుకుని వెళ్లాను. ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న నాకు ఇంటెలిజెన్స్ అధికారులు ఇలాంటి వాహనం ఇచ్చారు' అని రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఆగిన బుల్లెట్ప్రూప్ వాహనం: నడుచుకుంటూ ఇంటికెళ్లిన రాజా సింగ్
తాజాగా సోమవారం అఫ్జల్ గంజ్ మార్కెట్ వద్ద ఆయన కారు మొరాయించింది. డ్రైవర్ కారు దిగి మళ్లీ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. కారు మొరాయించడానికి కారణం తెలుసుకునేందుకు రాజాసింగ్ కూడా కారు దిగి ప్రయత్నం చేసినా కారు స్టార్ట్ కాలేదు. దీంతో రాజాసింగ్ తన కారును, డ్రైవర్ను అక్కడే వదిలేసి.. నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు.