ఎమ్మెల్యే రాజాసింగ్ అల్టిమేటం: బిజెపి నాయకత్వానికి కొత్త చిక్కులు
హైదరాబాద్: పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న హైదరాబాద్ నగర శాసనసభ్యుడు రాజాసింగ్ లోథా బిజెపి నాయకత్వానికి కష్టాలు తెచ్చిపెట్టారు. గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని ఐదు శాసనసభా నియోజకవర్గాలకు బిజెపి ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే, పార్టీ కార్యకలాపాలకు మాత్రం నలుగురు మాత్రమే హైజరవుతున్నారు.
పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న గోషా మహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ బిజెపి నాయకత్వానికి కొత్త కష్టాలు తెచ్చి పెట్టారు. బిజెపి, టిడిపి ఆధ్వర్యంలో మంగళవారం నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల శంఖారావం బహిరంగ సభకు ఆయన హాజరు కాలేదు. తన నియోజకవర్గం గోషా మహల్ పరిధిలో బిజెపి ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు.

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిపై ఆయన బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయనపై బిజెపి నాయకత్వం గుర్రుగా ఉంది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంటే నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో పార్టీ నాయకత్వం మౌనంగా ఉండిపోయింది.
అయితే, రాజాసింగ్ మౌనంగా ఉండకుండా బిజెపి నాయకత్వానికి చిక్కులు తెచ్చి పెట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలోని డివిజన్లకు తాను సూచించిన నాయకులకే టికెట్లు ఇవ్వాలని, లేకపోతే వారిని స్వతంత్రులుగా బరిలోకి దింపుతానని అల్టిమేటం ఇచ్చారు.
ఈ స్థితిలో రాజాసింగ్ ప్రతిపాదించిన అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తారా, ఇతరులకు కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఈ స్థితిలో రాజాసింగ్ నియోజకవర్గ పరిధిలోని ఆశావహులు అయోమయంలో పడ్డారు.












Click it and Unblock the Notifications