ఎన్టీఆర్ లాగే: రాజయ్యపై కెసిఆర్ ఆవేదన
హైదరాబాద్: గతంలో ఎన్టీ రామారావు కూడా ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాదిరిగానే ఓ మంత్రిని తప్పించాల్సి వచ్చిందని అంటున్నారు. పది వేల రూపాయల లంచం తీసుకున్నాడని ఆరోపణ రావడంతో 1983లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కార్మిక మంత్రిని మంత్రివర్గం నుంచి తప్పించారు. ఇప్పుడు తన ఏడు నెలల పాలనలో ఉప ముఖ్యమంత్రి రాజయ్యను కెసిఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు.
రాజయ్యను తొలగించాల్సి రావడంపై కెసిఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. రాజయ్యను తప్పించాల్సి రావడం తనకు తీవ్ర ఆవేదనను కలిగించిందని ఆయన తన మంత్రివర్గ సహచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. బంగారు తెలంగాణ నిర్మాణం సమయంలో ఆరోపణలు రావడంతో అనివార్యమైన స్థితిలోనే రాజయ్యను తప్పించాల్సి వచ్చిందని కెసిఆర్ అన్నట్లు చెబుతున్నారు.
ఆదివారంనాడు తన మంత్రివర్గ సహచరులతో రాజయ్య వ్యవహారంపై తన బాధను పంచుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఫిర్యాదులు వస్తుంటే పద్ధతి మార్చుకోవాలని తాను రాజయ్యకు చాలాసార్లు చెప్పానని, అయినా ఫలితం కనిపించలేదని కెసిఆర్ అన్నారు. ఈ పరిస్థితి రాజయ్యకు ఎలా ఉందో గానీ తనకు మాత్రం చాలా బాధగా ఉందని ఆయన అన్నారు.
తన ప్రభుత్వం నీతీనిజాయితీలతో పనిచేస్తోందని, అందుకు సంబంధించి ప్రశంసలు వస్తున్న సమయంలో రాజయ్య వ్యవహారం చాలా ఇబ్బంది కలిగించిందని ఆయన అన్నారు. రాజయ్యకు ఏ మాత్రం ముందు చెప్పకుండా తన సన్నిహితులతోనూ, కడియం శ్రీహరి తదితరులోనూ మాట్లాడి కెసిఆర్ వ్యవహారమంతా ఆఘమేఘాల మీద నడిపించినట్లు తెలుస్తోంది.