దేశంలో తొలి వైరాలజీ ల్యాబ్, ఆన్లైన్లో ప్రారంభించిన రాజ్నాథ్, కిషన్ రెడ్డి, కేటీఆర్..
దేశంలో తొలి వైరాలజీ ల్యాబ్ను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈఎస్ఐ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటుచేసిన ఆస్పత్రిని ఢిల్లీ నుంచి ఆన్ లైన్ ద్వారా రాజ్నాథ్ ప్రారంభించగా.. కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంతోష్ గంగ్వార్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, డీఆర్డీవో అధికారులు పాల్గొన్నారు.
ఐ క్లీన్, ఐ సేఫ్ సంస్థల సహకారంతో డీఆర్డీవో ల్యాబ్ను నిర్మించింది. వైరాలజీ ల్యాబ్లో వైరస్ కల్చర్, వ్యాక్సిన్ తయారీపై కూడా ల్యాబ్ పనిచేస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో రెండు భారీ కంటైనర్లలో 15 రోజుల్లో వైరాలజీ ల్యాబ్ రూపొందించారు. వాస్తవానికి అభివృద్ది చెందిన దేశాల్లోనే వైరాలజీ ల్యాబ్లు అందుబాటులో ఉండగా.. భారత్లో తొలిసారి ల్యాబ్ నెలకొల్పారు.
Recommended Video
కరోనా వైరస్ సోకిన వారి కోసం గచ్చిబౌలిలో కోవిడ్ ఆస్పత్రి నిర్మించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 20 రోజుల్లోనే 1500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణం పూర్తయిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. రాష్ట్రంలో వైరస్ సోకిన రోగులకు చికిత్స అందజేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం 8 ఆస్పత్రుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ సందర్భంగా 88 లక్షల కుటుంబాలకు బియ్యం, నగదు పంపిణీ చేశామని మంత్రి వివరించారు.