రాజ్యసభ ఎన్నికలు: రేణుకా చౌదరి, అనిల్, రవిచంద్ర ఎంపీలుగా ఏకగ్రీవం
తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మూడు స్థానాలకు ముగ్గురే బరిలో అభ్యర్థులు ఉండటంతో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా, రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ నేడితో గడువు ముగిసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీలైన శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. అయితే, నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో వారు ముగ్గురే మిగలడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది.
ఇది ఇలావుండగా, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెతో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ ప్రకటించారు. ఇతర అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడం వల్ల ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా విజయం సాధించినట్లు మహావీర్ ప్రసాద్ వెల్లడించారు.ఐదు పర్యాయాలు లోక్సభ ఎంపీగా పనిచేసిన సోనియా గాంధీ.. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి.
మరోవైపు, గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరో ముగ్గురు నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా, అధికార బీజేపీకి చెందిన సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆ స్థానాలకు ఇతర అభ్యర్థులెవరూ నామినేషన్ వేయకపోవడం వల్ల నలుగురినీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి రీటా మెహతా ప్రకటించారు.












Click it and Unblock the Notifications