బీజేపిలో రాజ్యసభ సీటు చిచ్చు.!అజ్ఞాతంలో గరికపాటి.!బండి సంజయ్ థర్డ్ ఫేస్ పాదయాత్రకు విఘాతం!?
హైదరాబాద్ : మనస్పర్థలు, అంతర్గత విభేదాలు, అలకలు, ఆజ్ఞాతవాసం అన్ని రాజకీయ పార్టీల్లో సర్వసాధారణంగా ఉంటాయి. ఎన్నికలప్పుడు, పదవుల పందేరమప్పుడు పార్టీల్లో ఏ మేరకు ఐకమత్యం ఉందో బహిర్గతమవుతుంది. ఆయా రాజకీయ పార్టీల క్రమశిక్షణ, నాయకుల హుందాతనం బట్టి పార్టీలోని విభేదాలు బాహ్యప్రపంచానికి తెలుస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపిలో కూడా విభేదాలు భగ్గుమన్నప్పటికి అంతగా వెలుగుచూడడం లేదు. రాజ్యసభ సీటు తెలంగాణ బీజేపిలో కుంపటి రగిల్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

బీజేపిలో విభేధాలు.. రాజ్యసభ సీటు కేటాయింపు రచ్చ రచ్చ
తెలంగాణ రాజకీయ పార్టీలు విద్వేషాలకు పెట్టిన పేరుగా చలామణి అవుతుంటాయి. పైకి అంతా కలిసి ఉన్నట్టే కనిపించినా అంతర్గతంగా మాత్రం ఆదిపత్యపోరు కొనసాగుతూనే ఉంటుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన వ్యవహారం ఎక్కువగా చోటుచేసుకుంటుంది. అందుకు పార్టీ ముఖ్యనేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వమ్యం ఎక్కువ, అందుకే నాయకులు స్వేచ్చగా వ్యవహరిస్తుంటారని జరిగిన వివాదాన్ని ఆహ్లాదవాతవరణంలో ముగించేందుకు ప్రయత్నిస్తుంటారు. సంక్షోభం తలెత్తినప్పుడు మాత్రం ఐకమత్యంగా పోరాడటం కూడా వారికే సొంతం. ఇప్పుడు అవే వివాదాలు, మనస్పర్ధలు తెలంగాణ బీజేపి నేతలకు సంక్రమించినట్టు తెలుస్తోంది.

ఎన్నో ఆశలు పెట్టుకున్న గరికపాటి రామ్మోహన్ రావు.. రాజ్యసభ సీటును నిరాకరించిన బీజేపి పెద్దలు
తెలంగాణ బీజేపి నేతల్లో ఉన్న ఐకమత్యం మరే ఇతర పార్టీ నేతల్లో ఉండదనేంతగా బీజేపి నేతలు వ్యవహరిస్తుంటారు. సీట్ల కేటాయింపు అంశంలో, పదవుల పంపకాల అంశంలో మంచి పరిణతిని చూపిస్తుంటారు. చిన్న చిన్న కోపాలు, విద్వేషాలు రగిలినా పెద్దగా బహిర్గతం కాకుండా జాగ్రత్తపడుతుంటారు ముఖ్యనాయకులు. కానీ ఇటీవల కేటాయించిన రాజ్యసభ సీటు బీజేపి పార్టీలో ముఖ్యనేతల మద్య పొగపెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ బీజేపిలో కీలకంగా ఉన్న ఆ నేత రాజ్యసభ పదవీకాలం ముగిసిపోగా మళ్లీ రెన్యువల్ కోసం కోటి ఆశలు పెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఐతే బీజేపీ అదిష్టానం సదరు నేతకు మొండిచెయ్యి చూపినట్టు తెలుస్తోంది.

మొదట్లో సానుకూలత.. తర్వాత నిరాకరణ.. షాక్ కు గురైన గరికపాటి
తెలుగుదేశం పార్టీ నుండి బీజేపిలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావుకు రాజ్యసభ సీటును బీజేపి నిరాకరించింది. దీంతో గరిక పాటి గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బండి సంజయ్ రెండవ దశ పాదయాత్ర ముగిసిన తర్వాత ఒకటి రెండు సార్లు పార్టీ కార్యాలయానికి వచ్చిన గరికపాటి రామ్మోహన్ రావు తర్వాత అలకపాన్పునెక్కారు. మొదట్లో రాజ్యసభ సీటు రెన్యువల్ పట్ల సానుకూలంగా ఉన్న బీజేపి అధిష్టానం తర్వాత నిరాకరించేసరికి గరికపాటి షాక్ కు గరైనట్టు తెలుస్తోంది. అంతే కాకుండా బండి సంజయ్ పాద యాత్రలో రూట్ మ్యాప్, పోలీస్ పర్మిషన్, బహిరంగ సభా వేదికలు, ముఖ్యనేతలకు బస ఏర్పాట్ల బాద్యతలు చూస్తున్న గరికపాటి రామ్మోహన్ అకస్మాత్తుగా అజ్ఞాతంలోకి వెళ్లే సరికి పార్టీ నేతలు అయోమయానికి గురౌతున్నట్టు తెలుస్తోంది.

బండి సంజయ్ పాదయాత్రలో కీలక బాద్యతలు.. మూడవ ఫేస్ కు విఘాతం తప్పదా.?
ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్యసభ సీటును ఆశించిన గరికపాటికి ఆశలు ఫలించలేదు. వారం క్రితం ఢిల్లీ వెళ్లిన బండి సంజయ్ బీజేపి పెద్దలకు రాజ్యసభ అభ్యర్ధిగా డాక్టర్ కే.లక్ష్మణ్ పేరును బలపరిచి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో గరికపాటికి బదులు ఓబీసి జాతీయ నాయకుడు లక్ష్మణ్ కు రాజ్యసభ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 2014 జూన్ 10న తెలుగుదేశం పార్టీ నుండి చంద్రబాబు గరికపాటిని రాజ్యసభకు నామినేట్ చేయగా 2021 జూన్ 9వ తారీఖున తన పదవీకాలం ముగిసింది. దీంతో మళ్లీ రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న గరికపాటి రామ్మోహన్ కు నిరాశ ఎదురైంది. దీంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గరికపాటిని అదిస్టానం ఎలా బుజ్జగిస్తోందో చూడాలి. గరికపాటి అసంతృప్తి బండి సంజయ్ పాదయాత్ర మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications