చివరిసారిగా రాఖీ కట్టి.. అన్నకు కన్నీటి వీడ్కోలు పలికిన సోదరి
తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు రాఖీ పండగ ప్రతీకగా నిలుస్తోంది. అన్నా- చెల్లి మధ్య శాశ్వతమైన ఈ బంధాన్ని ప్రతి సంవత్సరం మరింత పటిష్టం చేయడమే రాఖీ పౌర్ణమి అంతరార్థం అని పెద్దలు చెబుతున్నారు. అయితే రాఖీ పౌర్ణమి వేళ రంగారెడ్డి జిల్లా, షాద్ నగర్ లో విషాదకరమైన ఘటన జరిగింది. ఓ సోదరి తన అన్నకు చివరిసారిగా రాఖీ కట్టి కన్నీటి వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని నెహ్రూ నగర్ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) అనే యువకుడు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. బుధవారం విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. చటాన్ పల్లి రైల్వే గేటు సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో నవీన్ అక్కడికక్కడే చనిపోయాడు. చేతికొచ్చిన కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే రాఖీ పండుగ సమీపిస్తున్న వేళ అన్నను కోల్పోయిన నవీన్ చెల్లెలు పూజిత బోరున విలపించింది. ఈ నేపథ్యంలో తన అన్నకు చివరిసారిగా రాఖీ కట్టింది. ఈ దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

నవీన్ కు రాఖీ కట్టేందుకు ముందుగానే రాఖీ కొని సిద్ధం చేసుకుంది పూజిత. అన్నా.. ఒక్కసారి లే.. అంటూ ఆమె బోరున విలపిస్తున్న దృశ్యాలు అక్కడివారిని కంటతడి పెట్టిస్తున్నాయి. బతికుండగా ప్రేమతో కట్టాల్సిన రాఖీని, మృతదేహానికి కడుతున్న దృశ్యాలు అక్కడున్న స్థానికులు, గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించాయి. నవీన్ మృతితో చటాన్ పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications