వైరస్ కోసమా..? ప్రజల కోసమా..? తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేతపై రాంగోపాల్ వర్మ సెటైర్స్
తెలంగాణలో లాక్డౌన్ నిబంధనలు సంపూర్ణంగా ఎత్తివేయడంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లాక్డౌన్ ఎత్తేసింది వైరస్ కోసమా లేక ప్రజల కోసమా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే అన్నారు. లాక్డౌన్ ఎత్తివేతపై వర్మ ఆదివారం(జూన్ 20) వరుస ట్వీట్లు చేశారు.
ఆర్థిక పరిస్థితుల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ ఎత్తివేస్తున్నామని... ఆకలి చావులను నివారించేందుకే ఆంక్షలు తొలగిస్తున్నామని.. అంతే తప్ప కోవిడ్ ఇంకా ముగిసిపోలేదని ప్రభుత్వం గట్టిగా చెప్పి ఉండాల్సిందన్నారు.
లాక్డౌన్ ఎత్తివేతను ఏదో సంబరాలు జరుపుకోవడానికి ఇచ్చిన స్వేచ్చలా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉందన్నారు. బాధ్యాతయుతమైన ప్రభుత్వం... 'లాక్డౌన్ లేకపోయినా మూడో వేవ్తో ముప్పు ఉందని చెబుతుంది. కోవిడ్ ప్రోటోకాల్ పాటించేవారు మాత్రమే ఆ ముప్పు నుంచి ప్రాణాలను రక్షించుకోగలరు.' అని చెబుతుందన్నారు.
తెలంగాణలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం(జూన్ 19) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు లాక్డౌన్ ఎత్తేశారు.లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.
We have to wait and see if the lockdown restrictions are lifted for the virus or for the people ?😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) June 20, 2021
నిజానికి రాత్రిపూట కర్ఫ్యూని కొనసాగించవచ్చునని చాలామంది భావించినప్పటికీ.. ప్రభుత్వం అన్ని నిబంధనలను ఎత్తివేసింది. ఆదివారం(జూన్ 20) నుంచి అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరి. మాస్కు ధరించకపోతే రూ.1వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భౌతికదూరం,శానిటైజేషన్ తప్పనిసరిగా పాటించాలి. జులై 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు,కోచింగ్ సెంటర్లు తెరుచుకుంటాయి.