క్యాన్సర్కు చికిత్స పొందిన చిన్నారికి సినీ నటుడు రానా చెక్కు
హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారి సహా 10 వేల మంది రోగులకు ర్యాపిడ్ ఆర్క్ రేడియోథెరపీ టెక్నాలజీ ద్వారా చికిత్స అందించి యశోద హాస్పిటల్ అరుదైన రికార్డును సృష్టించింది. ఈ విధానం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ మెడిలో బ్లాస్టోమాతో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారికి చికిత్సను అందించడం ద్వారా పదివేల మందికి చికిత్సను అందించిన ఘనతను యశోద హాస్పిటల్ సొంతం చేసుకున్నది.
ఈ సందర్భంగా సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సినీ నటుడు దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరుగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సకాలంలో వ్యాధిని గుర్తించి, తగిన చికిత్స చేయిస్తే రోగుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఈ క్రమంలోనే యశోద హాస్పిటల్ రాపిడ్ ఆర్క్ టెక్నాలజీతో 10 వేల మంది క్యాన్సర్ రోగులకు చికిత్స చేసి, వారికి పున:జన్మను ప్రసాదించడం అభినందనీయమన్నారు.
ఆ తర్వాత రానా బ్రెయిన్ ట్యూమర్ చికిత్స పొంది సాధారణ స్థితికి చేరుకున్న చిన్నారికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ డబ్బును చిన్నారి చదువుకు వినియోగించాలని బాలిక తల్లిదండ్రులకు ఆయన సూచించారు.
యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జీఎస్రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా అత్యాధునిక పరికరాలతో ప్రోటాన్ థెరపీ చికిత్స అందించేందుకు రూ.200 కోట్లను యశోద హాస్పిటల్ వెచ్చించిందని, త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యశోద గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ చంద్రశేఖర్, వెరియన్ మెడికల్ సిస్టమ్స్ సైంటిఫిక్ అడ్వైజర్ డాక్టర్ లూకా కొజ్జి, స్విట్జర్లాండ్కు చెందిన వెరియన్ మెడికల్ సిస్టమ్స్ డైరెక్టర్ మార్కస్ ఫీల్డ్మెన్, ముంబైకి చెందిన వీఎమ్ఎస్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్, పౌరసంబంధాలఅధికారి అశోక్వర్మ తదితరులు పాల్గొన్నారు.