మిస్సింగ్ కేసులో ట్విస్ట్... హత్య చేసింది భార్యే... ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని...
రంగారెడ్డి జిల్లాలో ఓ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. అదృశ్యమైన వ్యక్తి హత్యకు గురైనట్లు నిర్దారించారు. ప్రియుడితో కలిసి అతని భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి.. పక్కా ప్లాన్తో భర్తను హతమార్చినట్లు తేల్చారు.
వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కేశవగూడ గ్రామంలో మాణిక్యరావు(35),శోభరాణి(31) దంపతులు నివసిస్తున్నారు. కొన్నేళ్లు వీరి కాపురం సాఫీగానే సాగింది. కొన్నాళ్ల క్రితం శోభరాణికి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడటం.. అది వివాహేతర సంబంధానికి దారితీయడంతో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని లోలోపల ఆగ్రహంతో రగిలిపోయింది.
భర్త అడ్డు తొలగించుకునేందుకు అతన్ని హత్య చేయాలని భావించింది. ఇందుకోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ నెల 13న భర్తకు మాయ మాటలు చెప్పి నల్లమల అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ ప్రియుడితో కలిసి అతన్ని హత్య చేసింది. అనంతరం ఇద్దరు కలిసి మృతదేహాన్ని ఓ కవర్లో చుట్టారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో హైదరాబాద్-శ్రీశైలం హైవేని ఆనుకుని మనన్నూర్ సమీపంలో ఉన్న లోయలో మృతదేహాన్ని విసిరేశారు.
ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు శోభా రాణి ఇంటికి వెళ్లింది. భర్త కనిపించట్లేదని బంధువులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమయ్యారు. దీంతో శోభారాణి కూడా వారితో పాటు పోలీస్ స్టేషన్కు వెళ్లింది. పోలీసులు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీశైలం,యాదయ్య అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యోదంతం వెలుగుచూసింది.
నిందితులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా... అక్కడ కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
మూడు రోజుల క్రితం వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.జిల్లాలోని బషీరాబాద్ మండలంలో ఈ నెల 17న కర్ణాటకకి చెందిన వ్యక్తి ఒకరు హత్యకు గురయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు... కట్టుకున్న భార్య, ఆమె ప్రియుడు కలిసి అతన్ని హత్య చేసినట్లు తేల్చారు. మృతుడిని హనుమంతుగా గుర్తించారు. 21 ఏళ్ల క్రితం అతనికి అంబికా అనే మహిళతో వివాహమైనట్లు పోలీసులు వెల్లడించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం హనుమంతుకు పక్షవాతం వచ్చింది. కొన్నాళ్ల పాటు చికిత్స తర్వాత పక్షవాతం నయమైంది. అప్పటినుంచి ఓ హోటల్లో దినసరి కూలీగా పనికి కుదిరాడు.
అయితే తాగుడుకు బానిసైన హనుమంతు కూలీ డబ్బులన్నీ మద్యానికే ఖర్చు చేసేవాడు. రాత్రిపూట తాగొచ్చి భార్యతో గొడవపడేవాడు. తాగుడు అలవాటు మానుకోవాలని ఎన్నిసార్లు బ్రతిమాలుకున్నా అతడిలో మార్పు రాకపోగా వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. దీంతో బిడ్డల పోషణ కోసం అంబిక వ్యవసాయ పనులకు వెళ్లడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో రేవణ సిద్ధప్ప అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త వేధింపుల గురించి అతనికి చెప్పింది. దీంతో అతన్ని హత్య చేసేందుకు ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. ఓరోజు హనుమంతుకు మాయ మాటలు చెప్పి అంబిక అతన్ని సిద్దప్ప వద్దకు తీసుకెళ్లింది. ముగ్గురు కలిసి బైక్పై హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో హనుమంతుకు ఫుల్లుగా మద్యం తాగించి బండరాయితో తలపై మోది హత్య చేశారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు.