అత్యాచార యత్నం కేసు: ఇద్దరికి ఆరేళ్ల జైలు, జరిమానా
ఓ వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఇద్దరిని న్యాయస్థానం కఠినంగా శిక్షించింది.
వరంగల్: ఓ వివాహితపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఇద్దరిని న్యాయస్థానం కఠినంగా శిక్షించింది. ఒక్కొక్కరికి ఆరేళ్ల కఠిన జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ మంగళవారం మొదటి అదనపు సహాయక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ తీర్పు చెప్పారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం ఇంచెర్లపల్లికి చెందిన సపాట్ ఫికా(24), కృష్ణారెడ్డి(33)లు 2014 జులై 15 రాత్రి ఓ మహిళ ఇంటికి వెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిపై కేసు నమోదైంది.
విచారణలో నేరం రుజువు కావటంతో కోర్టు సపాట్ ఫికా, కృష్ణారెడ్డిలకు ఆరేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కొరికి రూ.15వేల చొప్పున జరిమానా విధించింది. జరిమానా నుంచి రూ.20 వేలు బాధితురాలకి చెల్లించాలని న్యాయమూర్తి తన తీర్పులో ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.దుర్గాజి వాదించగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కోర్టు లైజన్ ఆఫీసర్ మనోహర్, కానిస్టేబుల్ ముజఫర్ సాక్షులను న్యాయస్థానంలో హాజరుపర్చారు.
మహిళ హత్య కేసులో మూడేళ్ల జైలు
ఓ మహిళ మృతికి కారణమైన వ్యక్తికి మూడేళ్లు కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఈద తిరుమలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. మహిళను చంపే ఉద్దేశం లేకపోయినా, అతడి చర్యల వల్ల ఆమె మరణించడంతో గాండ్ల వెంకటేశ్వర్ల(40)కు మూడేళ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. స్టేషన్ఘన్పూర్ మండలం చాగల్లుకు చెందిన గాండ్ల వెంకటేశ్వర్లు, పోగుల సుధాకర్ల మధ్య భూతగాదా ఉంది. దీన్ని మనసులో పెట్టుకున్న వెంకటేశ్వర్లు సుధాకర్పై కక్ష పెంచుకున్నాడు. తనను ఎలాగైనా చంపుతానంటూ ఇతరులతో వ్యాఖ్యానించాడు. 2014 సెప్టెంబంర్ 3న సాయంత్రం సుధాకర్ ఇంటికి వెళ్లి గొడవ చేసి, కొట్టాడు.
తన కొడుకును ఎందుకు కొడుతున్నావంటూ సుధాకర్ తల్లి వెంకటేశ్వర్లును నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన వెంకటేశ్వర్లు ఆమెను తీవ్రంగా కొట్టాడు. దెబ్బలకు ఆమె స్పృహ కోల్పోయి కొంతసేపటికి మరణించింది. మృతురాలి కుమారుడు సుధాకర్ స్టేషన్ఘన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంకటేశ్వర్లపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం వెంకటేశ్వర్లుకు పైశిక్ష విధించింది. ఈ కేసును ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.బాలకిషన్రావు వాదించగా, కోర్టు లైజన్ ఆఫీసర్ జి.నారాయణ, కానిస్టేబుల్ పి.రఘు సాక్షులను న్యాయస్థానంలో హాజరుపర్చారు.