కాంగ్రెసులో కెసిఆర్ చిచ్చు: కర్ణాటక మంత్రిపై కుంతియా భగ్గు
Recommended Video
హైదరాబాద్: కాంగ్రెసులో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చిచ్చు పెట్టారు. కేసీఆర్కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ ఓవైపు పోరాటం చేస్తుంటే కర్ణాటక మంత్రి రేవణ్ణ దానికి గండి కొట్టే ప్రయత్నం చేశారు.
కేసీఆర్పై రేవణ్ణ ప్రశంసల జల్లు కురిపించారు. కర్ణాటకలో కాంగ్రెసు ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే. ఓవైపు హైదరాబాద్ గాంధీ భవన్లో కుంతియా కేసీఆర్పై విమర్శల జడివాన కురిపించారు. మరోవైపు రేవణ్ణ కేసీఆర్ను పొగిడారు. రేవణ్ణపై కుంతియా భగ్గుమన్నారు.
రేవణ్ణపై కుంతియా సీరియస్
కేసీఆర్ను రేవణ్ణ ప్రశంసించడంపై కుంతియా మండిపడ్డారు. తెలంగాణకు వచ్చి మరీ కేసీఆర్ను ప్రశంసించడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో జరిగిన గొల్ల, కురుమల భవన శంకుస్థాపనకి కర్ణాటక మంత్రి రెవణ్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిని పొగిడారు.
కెసిఆర్ను ఇలా ప్రశంసించారు...
రైతులకు 24 గంటల కరెంట్ అందించి తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రేవణ్ణ ప్రశంసించారు. గొల్ల, కురుమల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భవనాలు నిర్మిస్తున్నందకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి సారి గొర్రెలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని ఆయన కొనియాడారు. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వమని ఆయన అన్నారు. కేసీఆర్ పాలన యావత్ దేశానికే ఆదర్శమని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేస్తా..
రెవణ్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాస్తానని కుంతియా తెలిపారు తెలిపారు. కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెసు నేతలు శుక్రవారంనాడు గాంధీ భవన్ సమావేశంలో కేసీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
గాంధీభవన్లో కుంతియా
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కుంతియా అన్నారు. గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెసు సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. నిరుద్యోగ సమస్యతోపాటు రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని, హక్కుల కోసం పోరాడుతున్న వారిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తోందని ఆయన అన్నారు. ఇదేనా సామాజిక న్యాయమంటే అని ప్రశ్నించారు. కేసీఆర్ను తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు.