టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ధ్యేయంగా కెసిఆర్: రావుల, ఖబడ్దార్: రాజారాం
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్టు చేయడంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి సోమవారం నాడు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పని చేస్తోందని ఆరోపించారు. సండ్ర అరెస్టును ఖండిస్తున్నామన్నారు.
ఖబడ్దార్: రాజారాం యాదవ్
కెసిఆర్ మాట్లాడే భా, తెలంగాణ భాష కాదని తెలంగాణ టీడీపీ నేత రాజారాం యాదవ్ అన్నారు. గతంలో సీమాంధ్రుల పైన వాడిని భాషను కేసీఆర్ ఇప్పుడు బీసీలు, దళితుల పైన ప్రయోగిస్తున్నారన్నారు. దొర సంస్కృతి, భాషతో భయపెట్టాలని చూస్తే ఖబడ్తార్ అన్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ప్రాజెక్టులన్నారు.
సన్నాసికి సన్నాసి మాటలే వస్తాయని మరో నేత అద్దంకి దయాకర్ అన్నారు. వ్యక్తులనుతిట్టడం సమంజసం కాదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టు దుమ్మిడిహట్టి వద్ద ప్రారంభిస్తే కమిషన్లు రావనే కెసిఆర్ కాళేశ్వరం నుంచి మొదలు పెడుతున్నారని ఆరోపించారు. కమిషన్ వచ్చే ప్రాజెక్టులు మాత్రమే కెసిఆర్ చేపడతారన్నారు.
ఓటుకు నోటు కేసుతో ప్రభుత్వానికి సంబంధం లేదు: సీతారాం నాయక్
ఓటుకు నోటు కేసు విచారణతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎంపీ సీతారాం నాయక్ అన్నారు. అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి జైలు నుంచి బెయిల్పై విడుదలైతే ర్యాలీగా తీసుకెళ్లడం టీడీపీకే చెల్లిందన్నారు.
ఆయన సోమవారం కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిశారు. అనంతరం మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వేలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. ఏపీ ఎక్స్ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ప్రెస్గా పేరు మార్చాలని విజ్ఞప్తి చేశానన్నారు. కారేపల్లి-ఇల్లందు ప్యాసెంజర్ రైలును పునఃప్రారంభించాలని, ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.