కేసీఆర్కు చెంపపెట్టు, ఇకవద్దు: రావుల, భద్రాచలం ఎంపీపీగా టీడీపీ నేత
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తమ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయల్ రద్దు పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేయడం తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డి శుక్రవారం అన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తమ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికేనా ప్రభుత్వం తెగేదాకా లాగవద్దని హితవు పలికారు. ప్రజా సమస్యల పైన ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
మొత్తం అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారన్నారు. టీడీపీ నేతల పైన కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుండి విడుదలైన తర్వాత సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారి పైన కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని కార్యక్రమాలు నిలిపేసి రేవంత్ రెడ్డి కేసు సింగిల్ పాయింట్గా అధికార పెద్దలు పని చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీని పైన ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కేసులు మీరే వేస్తారు.. తీర్పులు కూడా మీరే చెబుతారా అని ప్రశ్నించారు.
న్యాయవ్యవస్థ పైన వ్యక్తులకు నమ్మకం లేకపోవచ్చునని, సమాజానికి నమ్మకముందన్నారు. న్యాయవ్యవస్థనే ప్రశ్నించేలా అదనపు అడ్వోకేట్ జనరల్ ఢిల్లీలో మాట్లాడారని మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా ఏర్పడిన వ్యవస్థను గౌరవించాలన్నారు.
పుష్కర పనుల్లో అవకతవకలు: పొంగులేటి
గోదావరి పుష్కరాల పనుల్లో నాణ్యతాలోపం స్పష్టంగా కనబడుతోందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. దీనికి బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో పుష్కర ఘాట్ల వద్ద మురుగునీరు కలుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు సోనియాను ఆహ్వానించామని చెప్పారు.
భద్రాచలం ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి శాంతమ్మ
ఖమ్మం జిల్లా భద్రాచలం ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వూకే శాంతమ్మ ఎన్నికయ్యారు. శాంతమ్మకు అనుకూలంగా ఏడుగురు సభ్యులు మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications